మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని, నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని సిఎం సూచించారు.
అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీలో మురుగు నీటిని ముం దుగా శుద్ధి చేయాలని సిఎం సూచించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్రామ్ గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.
మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సిఎంకు వివరించా రు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు. నగరం మధ్యలోంచి వెళ్లే మూసీ నది సుందరీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే కన్సల్టెంట్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం ఆహ్వానించింది.
మూసీ సుందరీకరణతో నగరం అన్నివైపులా అభివృద్ధికి దోహ దం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి దుబాయ్ వెళ్లి కన్సలెంట్లతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నదిలో రోడ్డు, మెట్రో, బోటింగ్ సౌకర్యాలు మెట్రోలో పాతిక కిలోమీటర్ల దాకా భూ మార్గం నిర్మించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా నది వెంట మెట్రోరైలు నిర్మాణానికి రూ.9వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైలు అధికారులు అంచనా వేశారు. 55 కి.మీ. దూరంలో 25 కిలోమీటర్ల వరకు ఎట్ గ్రేడ్(భూ మార్గం)గా వెళ్లేందుకు అవకాశముందని ప్రభుత్వానికి మెట్రో అధికారులు తెలిపారు. పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంని మెట్రో అధికారులు తెలిపారు.
ఇక మూసీ నదీ కారిడార్ వెంట రోడ్ కమ్ మెట్రోరైలు మార్గం ఏర్పాటుచేయాలన్నది సర్కారు ఆలోచన. ఔటర్ రింగ్ రోడ్డు ఒకవైపు నుంచి రెండో వైపు రావాలంటే దాదాపు 80 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదే పట్టణం లోపలి నుంచి రహదారి ఉంటే రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. మూసీని సుందరీకరించడంతో పాటు రహదారి నిర్మాణం ఉంటుంది.
ఈ మేరకు మెట్రో రైలు మార్గం నిర్మించాలన్నది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఈ మార్గంలో నాగోల్ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకెళ్లే ఆలోచనను హెచ్ఎంఆర్ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వానికి సూచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలపై సైతం అధ్యయనం చేస్తుంది.
హైదరాబాద్లో నార్సింగి వద్ద ఓఆర్ఆర్ నుంచి మొదలు బాపూఘాట్, హైకోర్టు, చాదర్ఘాట్, నాగోలు వైపు నుంచి తూర్పు హైదరాబాద్లోని ఓఆర్ఆర్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూసీ నదిలో ప్రయాణించవచ్చు. మూసీ ఆధునీకరణతో నగరం నలుమూలలా అభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మూసీ వెంట రహదారి, మెట్రోతో పాటు నదీ గర్భంలో ఎల్లవేళలా నీరు ఉండేలా చేసి బోటు ప్రయాణం నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలిసింది.
