తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని కోరుతూ, అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సచివాలయంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో ఆయన సమావేశం అయ్యారు. బిఇఎంఎల్ కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు.
మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సీఎండీ శంతను రాయ్ డిప్యూటీ సీఎం వివరించారు. బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని, రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్లో, సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు. హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు.
హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు ఆయన తెలిపారు. మెట్రో కోచ్ ఫ్యాక్టరీల తయారీలో ఇతర కంపెనీలకు బిఇఎంఎల్ కు ఉన్న తేడా ఏంటి? ధరలు, నాణ్యత వంటి అంశాల్లో మీకు ఉన్న ప్రత్యేకత ఏంటో కంపెనీ లెటర్ పై వివరించాలని ఉపముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా బిఇఎంఎల్ కంపెనీ మెట్రో కోచ్ నమూనాను కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందం డిప్యూటీ సీఎంకు అందజేసింది.
అంతేగాక, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని వాతావరణం, వనరులను పరిశీలించాలని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి మెట్రో రంగానికి సంబంధించిన మీ కంపెనీ ఆసక్తులను సమగ్రంగా చర్చిద్దామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా బీఈఎంఎల్ కంపెనీ మెట్రో కోచ్ నమూనాను కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందం డిప్యూటీ సీఎంకు అందించింది.