వేసవి ప్రారంభంలోనే బెంగళూరు నగర వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసుల నీటికష్టాల్ని తీర్చడానికి వాహనాలను కడగడం, తోటపని, వినోదం కోసం వాటర్ ఫౌంటైన్ల వంటి వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి బోర్టు (బిడబ్ల్యుఎస్ఎస్బి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వుల్ని ఉల్లంఘించిన వారికి పౌర సంఘం రూ. 5,000 జరిమానా విధించింది. మళ్లీ మళ్లీ ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానాకి మరో రూ. 500 జోడించబడుతుందని పౌర సంఘం ఆదేశాల్లో తెలిపింది. దీనికోసం బిడబ్ల్యుఎస్ఎస్బి ప్రత్యేక కాల్ సెంటర్ని కూడా ప్రారంభించింది. ఈ ఉత్తర్వులను పౌరులు ఉల్లంఘిస్తే వెంటనే 1916కు కాల్చేయాలని కోరింది.
మాల్స్, సినిమా హాల్స్లో కూడా తాగునీరు, రోడ్లు శుభ్రం చేయడం, ఇతర క్లీనింగ్ పనులకు మాత్రమే నీటిని వినియోగించాలని (బిడబ్ల్యుఎస్ఎస్బి) ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు నగరంతోపాటు పలు జిల్లాల్లో కూడా నీటికొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
బెంగళూరు నగరంలో వేలాది బోర్వెల్లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని పలువురు అంటున్నారు. 2023లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరు ఇటీవల అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బెంగళూరులోని కుమారకృపా రోడ్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఉన్న భవనంలో కూడా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నీటికొరతను తీర్చేందుకు బెంగళూరు నగరపాలక సంస్థలు, జిల్లా యంత్రాగం నగరంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అనవసర ప్రయోజనాల కోసం తాగునీటి వినియోగాన్ని నిషేధించేందుకు చట్టం 1964 33, 34 ప్రకారం బిడబ్ల్యుఎస్ఎస్బి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నీటి కొరతను తీర్చేందుకు బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
భూగర్భ జలాలు అడుగంటడంతో సంక్షోభానికి దారితీసిందని నగర వాసులు తమ బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మున్సిపల్ వాటర్ ట్యాంకుల వద్ద పొడవైన క్యూలు ఇప్పుడు సాధారణంగా మారాయి. అయితే కొందరు డబ్బులు వెచ్చించి నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నా.. అవీ సరిపోకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదు.
కరవు పరిస్థితులపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 తాలూకాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని, 109 తాలూకాలు కరవుతో అల్లాడుతున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.