టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్ను సస్పెండ్ చేస్తూ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఉత్తర్వులు జారీచేశారు. తిరుపతి దిశ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ (పీసీ – 2514) అన్నమయ్య జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వరి తిరుపతి జిల్లా భాకరాపేట మీదుగా వెళ్తుండగా కలిశారు.
కానిస్టేబుల్పై ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిర్గతం చేయడం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎట్టి పరిస్థితులలో కూడా నియమాలని ఉల్లంఘించవద్దని జిల్లా ఎస్పీకృష్ణ కాంత్ పటేల్ ఇప్పటికే ఉద్యోగులకు దిశా నిర్దేశం చేస్తూ హెచ్చరించారు.