తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి సుప్రీంకోర్టు గురువారం చీవాట్లు పెట్టింది. డిఎంకె నేత కె. పొన్ముడి మంత్రిగా తిరిగి నియమించడాన్ని తిరస్కరించడంపై ఆయనను తీవ్రంగా మందలించింది. తమిళనాడు గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరించారని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
డిఎంకె నేత పొన్ముడిని మంత్రిగా చేర్చుకునేందుకు ఒక్కరోజు గడువు ఇస్తున్నామని, శుక్రవారం నాటికి నియామకం జరగాలని చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గవర్నర్ను ఆదేశించింది.
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని గవర్నర్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని, గవర్నర్ తీరుపట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని మండిపడింది. రాష్ట్ర గవర్నర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని దుయ్యబట్టింది.
పొన్ముడిని రాష్ట్ర కేబినెట్లో చేర్చడానికి గవర్నర్ నిరాకరించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉపశమనం ద్వారా సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసిందని స్టాలిన్ గవర్నర్కి లేఖ రాశారు. అయితే సుప్రీంకోర్టు శిక్షపై స్టే మాత్రమే విధించిందని, ఆయనను కేబినెట్లోకి తీసుకోవడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని గవర్నర్ వ్యాఖ్యానించారని స్టాలిన్ పేర్కొన్నారు.
కాగా, అక్రమాస్తుల కేసులో పొన్ముడికి మద్రాస్ హైకోర్టు జైలు శిక్ష విధించడంతో అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అనంతరం సుప్రీంకోర్టు ఆయన నేరాన్ని, రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆయనను మంత్రిగా నియమించాలని నిర్ణయించింది.