ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది. 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేజ్రీని తిరిగి కోర్టులో హాజరుపరచాలని సూచించింది.
ఆయన్ని పూర్తిగా కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన్ని శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. “నేను జైలులో ఉన్న బయట ఉన్న నా జీవితం దేశానికి అంకితం” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో “కీలక కుట్రదారు” అని ఆరోపిస్తూ ఈడీ 10 రోజుల రిమాండ్ను కోరింది.
ఈడీ వినతి మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ కేజ్రీ వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే ఆయన్ని అరెస్టు చేశారు.
పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌత్ గ్రూపునకు చెందిన కొందరు నిందితుల నుంచి కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేశారని ఈడీ తరఫు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపారు. కాగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదటి నుంచీ జరిగింది.
అందరూ అనుకున్నట్లుగానే ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు.. శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేజ్రీవాల్ ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా నాలుగు రోజుల క్రితం అరెస్టయ్యారు.