శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేరవేసే పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు.
ఈ ప్రత్యేక తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సెంటర్లలో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను సోమవారం హైదరాబాద్లోని బస్భవన్లో టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్ను ఆయన ప్రారంభించారు.
భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ 040-23450033, 040-69440000, 040-69440069 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టిఎస్ ఆర్టీసి యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు.
2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా గతేడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ అన్నారు. భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని సజ్జనార్ సూచించారు.