బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో గురువారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. తన కొడుకు పరీక్షలు ఉన్నందుకు బెయిల్ ఇవ్వాలని కవిత తరుపు లాయర్ కోర్టును కోరారు. ఏప్రిల్ 16వ వరకు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని, ఆమెకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. లిక్కర్ పాలసీ ప్లాన్ చేసిందే కవిత అని, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు ఆటంకం కలుగుతుందని ఈడీ తెలిపింది.
అరుణ్ పిళ్లై, కవిత బినామిగా ఉన్నాడని, వీరికి ఇండో స్పిరిట్ lo 33 శాతం వాటా ఉందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఈడి తరుపు న్యాయవాది వాటిని కోర్టుకు సమర్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసింది. ఈ నెల 8న ఉదయం 10.30గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు చెప్పింది. ఈనెల 20న రెగ్యులర్ బెయిల్ పై విచారణ జరగనుంది.