శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న వేద్దా తెగ ప్రజల్లో భారతీయ మూలాలు ఉన్నట్టు సీసీఎంబీ, మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఐదు సంస్థ ల నుంచి పది మంది పరిశోధకులు శ్రీలంకలోని మైనార్టీ సమూహమైన వేద్దా జనాభా జన్యు చరిత్ర విషయాలను వెలుగులోకి తెచ్చారు.
వీరిని స్థానికంగా వన్నియలేటోలుగా పిలుస్తారు. వేద్దా తెగ భాష, వ్యవహారికం, సాంస్కృతిక లక్షణాలు వైవిధ్యంగా ఉండటమే ఈ పరిశోధనకు కారణమని సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ కే తంగరాజ్ తెలిపారు.
ఈ తెగ భారతీయులతో గణనీయమైన జన్యు సంబంధాన్ని కలిగి ఉన్నట్టు తమ ఆటోసోమల్ విశ్లేషణలో తేలిందని బీహెచ్ యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే పేర్కొన్నారు. వీరిలో శ్రీలంకలోని సింహళీయులు, శ్రీలంక తమిళుల మూలాలు కూడా ఉన్నాయని కొలొంబో యూనివ ర్సిటీకి చెందిన రువాండీ రణసింగ్ చెప్పారు.
ఈ పరిశోధన ద్వారా దక్షిణాసియా జనాభా చరిత్రపై మరిన్ని కోణాలు ఉంటాయని భావిస్తున్నారు. తమ పరిశోధన దక్షిణాసియావాసుల జన్యు వైవిధ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి చెప్పారు.