కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం నాడు రాయ్బరేలీ ప్రజలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీకి వారు తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలను అందించాలని కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన కుమారుడిని ప్రజలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీలతో కలిసి రాయ్బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు.
“నా జీవితమంతా మీ ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోయింది. మీ ప్రేమ నన్ను ఒంటరిగా భావించనీయదు. మీరు నాకు అన్నీ ఇచ్చారు. నా కొడుకును మీకు అప్పగిస్తున్నాను. మీరు నన్ను మీ స్వంతంగా భావించినట్లే, రాహుల్ను మీ స్వంతంగా పరిగణించండి. రాహుల్ మిమ్మల్ని నిరాశపరచడు” అని భావద్వేగ విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై పోటీ చేస్తున్నారు. సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడానికి ముందు రెండు దశాబ్దాల పాటు ఈ స్థానం నుండి గెలిచారు. రాయ్బరేలీ ప్రజలు తనకు 20 ఏళ్ల పాటు ఎంపీగా సేవలందించే అవకాశం కల్పించడమే తన జీవితంలో అతిపెద్ద ఆస్తి అని సోనియా గాంధీ పేర్కొన్నారు.
రాయ్బరేలీ తన కుటుంబమని, అదే విధంగా అమేథీ కూడా తన ఇల్లు అని పేర్కొన్న గాంధీ, “నా జీవితంలోని సున్నితమైన జ్ఞాపకాలు, కుటుంబ మూలాలు గత 100 సంవత్సరాలుగా ఈ మట్టితో ముడిపడి ఉన్నాయని తెలిపారు. కాగా, ఇందిరా గాంధీ, రాయ్బరేలీ ప్రజలు తనకు నేర్పిన పాఠాలైన అందరినీ గౌరవించడం, బలహీనులను రక్షించడం, ప్రజల హక్కులు, అన్యాయంపై పోరాడడం వంటివి రాహుల్, ప్రియాంకకు తాను నేర్పినట్లు సోనియా గాంధీ తెలిపారు. ‘భయపడొద్దు. మీ పోరాట మూలాలు, సంప్రదాయాలు చాలా లోతైనవి’ అని ఆమె పేర్కొన్నారు.
కాగా, ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ… జూన్ 4న ప్రభుత్వం ఏర్పడుతుందని, జూలై 4న లక్షలాది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ. 8,500 జమ అవుతుందని ప్రకటించారు. ఒకసారి కాదు, తరువాతి నెలల్లో కూడా అని చెప్పారు. భారతదేశంలో కోటి మందిని కోటీశ్వరులను తయారు చేయాలనే తన అభిలాషను వ్యక్తం చేశారు. ‘నరేంద్ర మోదీ 22 మందిని బిలియనీర్లుగా మార్చారు, మేం కోట్లాది మందిని కోటీశ్వరులను చేస్తాం’ అని రాహుల్ గాంధీ
స్పష్టం చేశారు.
