కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటుదక్కింది. వీరిలో ఇద్దరు తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు మంత్రిపదవులు ఖరారు కాగా.. అనూహ్యంగా నరసాపురం బజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. తెలంగాణ నుండి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరుతున్నారు.
నరసాపురం నుంచి పోటీచేసి తొలిసారి విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గూడురు ఉమాబాలపై 2.79 లక్షల ఓట్ల పైచిలుక మెజార్టీతో గెలుపొందారు. అయితే, శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవే కాదు.. ఎన్నికల్లో టిక్కెట్ కూడా అనూహ్యంగా దక్కాయి. చివరి వరకూ బీజేపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణరాజు పేరు బలంగా వినిపించింది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా శ్రీనివాస వర్మ పేరు తెర మీదకు వచ్చింది.
భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలుగా ఆయన బీజేపీలో కొనసాగడంతో ఆ పేరు వచ్చింది. మున్సిపల్ కౌన్సిలర్గా, డీఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రెటరీ, కరస్పాండెంట్గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్గా వ్యవహరించారు.
1980ల్లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్లో పని చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. తర్వాత బీజేపీ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1991-1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరించారు.
2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక, పీజీ చదివిన శ్రీనివాసవర్మ.. 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం
తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బిజెపి ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చేరుతున్నారు. కరీంనగర్ నుండి రెండిసారి గెలుపొందిన , బండి సంజయ్ కుమార్ కు కూడా ఇవాళ సాయంత్రం మోదీతో పాటు వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలిచారు. గతంలోనూ ఇదే స్థానం విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. సంజయ్ 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ పై విక్టరీ కొట్టారు.
అంతకుముందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన సంజయ్, 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర కేబినెట్ లో చోటు సాధించారు.