గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులతో, గత సంవత్సరంకన్నా రెంట్టింపు మొత్తాలతో ఈ సంవత్సరం రూ 2.25 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ ఉండగలదని ప్రభుత్వ వర్గాలు సంకేతం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 1న సాధారణ వార్షిక బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ను కూడా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా రైళ్లు సరిగ్గా తిరగడం లేదు. దానితో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. పలు రైల్వే ప్రాజెక్ట్ లు కూడా ముందుకు సాగడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రయాణికుల సదుపాయాలను విశేషంగా మెరుగుపరచే విధంగా ఈ సారి రైల్వే బడ్జెట్ ఉండగలదని భావిస్తున్నారు.
గతంలో రైల్వే బడ్జెట్ను ఆ శాఖ మంత్రి ప్రకటించేవారు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సాధారణ బడ్జెట్లోనే ఓ ప్రత్యేక కేటగిరి కింద ఉంచి కేటాయింపులు చేస్తున్నారు. గతేడాది కేంద్ర ప్రభుతం రూ.1,10,055 కోట్లను రైలే బడ్జెట్ కింద కేటాయించింది. ఈ సారి ఏకంగా ఈ బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
రైల్వే కేటాయింపులు 15 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. మహమ్మారి కాలంలో కేవలం సరుకుల రవాణా, వాణిజ్యం కోసం రైల్వే శాఖ తమ సేవలు అందించింది. అయితే గతేడాది సుమారు రూ.26,338 కోట్ల నష్టం వాటిల్లింది. దానితో ప్రయాణికులపై కొంత భారం వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
రైల్వే టికెట్ ధరలను పెంచే విషయంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. బుల్లెట్ రైళ్ల విషయంలో కూడా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా.. ఢిల్లి నుంచి వారణాసి మధ్య బుల్లెట్ రైలును కూడా ప్రకటించనున్నారు. డీజిల్, విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తిపై రైల్వే శాఖ దృష్టి పెట్టనుంది.
2030 నాటికి 100 శాతం రైల్వే విద్యుదీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అల్యూమినియంతో తయారైన 10 కొత్త లైట్ ట్రైన్లను బడ్జెట్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టూరిస్టు ప్రాంతాలను కలిపే కొత్త లైన్ల ప్రకటన కూడా వెలువడనుంది. కరోనా కాలంలో వచ్చిన నష్టాన్ని ఈ ఏడాది భర్తీ చేసేలా సరికొత్త వ్యూహాలతో రైల్వే బడ్జెట్ ఉండనుంది.
రైల్వే శాఖతో సంబంధం ఉన్న అన్నీ శాఖలకు కేటాయింపులు భారీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కరోనా కాలంలో రైల్వే శాఖకు ఎక్కువ ఆదాయం సరుకు రవాణా ద్వారా వచ్చింది. అందువల్ల ప్యాసింజర్ రైళ్లపై ఒత్తిడిని తగ్గించే వివిధ సరుకు రవాణా కారిడార్లను సిద్ధం చేయడానికి కృషిచేస్తున్నది. రైల్వే కనెక్టివిటీపై కూడా దృష్టి కేంద్రీకరించారు.
రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో రైల్ కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటి కోసం ప్రభుతం కొన్ని ప్రైవేటు కంపెనీలతో కలిసి ముందుకు వెళ్తున్నది. రైలే స్టేషన్లను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. పీపీపీ మోడల్ ద్వారా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.
ఇందుకోసం 12 కారిడార్లను గుర్తించారు. పలు కంపెనీలు దీనిపై ఆసక్తి చూపాయి. రైల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటును కూడా ప్రకటించొచ్చు. ఇది ఛార్జీలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.