రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని,. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావించారు.
జమ్మూకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కానీ, ఈ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని రాష్ట్రపతి చెప్పారు. శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారని ఆమె కొనియాడారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం అని ఆమె ప్రశంసించారు.
గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని చెబుతూ ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామని ఆమె వెల్లడించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో దేశంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగామని చెప్పారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలు సులభతరమయ్యాయని ఆమె తెలిపారు.
దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సుస్థిరత, నిజాయతీని నమ్మారని చెబుతూ పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, పంటలకు మద్దతు ధరకు కట్టుబడి ఉన్నామని ముర్ము తెలిపారు. వ్వవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని.. ప్రజాక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని.. రైతుల సంక్షేమం కోసం అతి పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో అడవుల విస్తరణ ఉంటుందని ఆమె తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్తో దేశ ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నామని, చిన్నరైతులకు పీఎం సమ్మాన్ నిధి ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, పెట్టుబడులు, ఉపాధికల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చామని రాష్ట్రపతి చెప్ప్పుకొచ్చారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ విధానాలను ప్రజలు విశ్వసించారని.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్ మేరకు భారత్ ఉత్పత్తులు అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. తమ దేశం వేగంగా పురోగతి సాధిస్తోందని చెప్పారు.
