హైదరాబాద్లోని మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్లో భారీ అక్రమాలు జరిగాయని ఈడీ అధికారులు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు బ్యాంక్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఈ సోదాల్లో కోటి రూపాయిల నగదుతో పాటు 5 కోట్ల రూపాయిల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
1800 మందికి డమ్మీ గోల్డ్లోన్స్ ఇచ్చినట్లు తమ సోదాల్లో తేలిందన్నారు. పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నారన్నారు. బ్యాంక్లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ తెలిపింది.
తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేశారని, వక్ఫ్బోర్డ్కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని ఈడీ పేర్కొంది. మహేష్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో రూ.300 కోట్ల నిధుల గోల్మాల్కు సంబంధించిన కేసులో బ్యాంకు ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది.
హైదరాబాద్లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, నిబంధనలకు విరుద్ధంగా రూ.300 కోట్లకుపైగా రుణాల మంజూరు, బ్యాంకు నుంచి రూ.18.30 కోట్లు దారి మళ్లింపు ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది.
దీనిలో భాగంగా బ్యాంకు చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, వైస్ చైర్మన్ పురుషోత్తమదాస్, ఎండీ ఉమేష్ చంద్కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించిన విషయం తెలిసిందే.