హిండెన్బర్గ్ తాజా నివేదికపై బీజేపీ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత స్టాక్ మార్కెట్ల సమగ్రతను ప్రశ్నిస్తూ దేశంలో ఆర్దిక అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ హిండెన్బర్గ్ నివేదిక శనివారం వచ్చిందని, ఆదివారం దీనిపై గందరగోళం చెలరేగితే సోమవారం క్యాపిటల్ మార్కెట్లో అస్ధిరత నెలకొంటుందని గుర్తు చేశారు.
అదానీ విదేశ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్బర్గ్ తాజా నివేదికలో వెల్లడించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో ఆరోపణలు నిరాధారమైనవని మాధవి పురి బుచ్ తోసిపుచ్చారు.
అయితే ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. ఇక ఈ నివేదిక వెల్లడించిన సమయాన్ని పరిశీలిస్తే ఏదో జరుగుతున్నదని అర్ధమవుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
జులైలో సెబీ నుంచి హిండెన్బర్గ్కు షోకాజ్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసుకు బదులివ్వాల్సింది పోయి హిండెన్బర్గ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. దీనిపై సెబీ, సెబీ చీఫ్ స్పందించారని తెలిపారు.
హిండెన్బర్గ్లో అమెరికన్ బిలియనీర్ జార్జ్ సొరోస్ కీలక ఇన్వెస్టర్ కావడంతో ఇందులో భారీ కుట్రకు తెరలేపారనే అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ విపరీతమైన ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.