వాల్మీకి స్కామ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై నమోదైన 2014నాటి ముడుపుల కేసులో లోకాయుక్త పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించినప్పటికీ పట్టించుకోకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సిద్ధరామయ్య మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు 2014 జూలై 28న మైసూరులోని వివేక్ హోటల్స్ ఎండీ వివేకానంద అలియాస్ కింగ్స్ కోర్టు వివేక్ వద్ద నుంచి రూ.1.3 కోట్ల చెక్కును లంచంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు టర్ఫ్ క్లబ్ లిమిటెడ్కు స్టెవార్డ్గా నియమించేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణ.
ఈ కేసులో క్విడ్ ప్రోకో జరగలేదని పేర్కొంటూ గత ఏడాది జూన్ 7న కర్ణాటక లోకాయుక్త డిప్యూటీ ఎస్పీ కోర్టులో కేసు క్లోజర్ రిపోర్టును సమర్పించారు. లోకాయుక్త నివేదికను సవాల్ చేస్తూ బీబీఎంపీ మాజీ కౌన్సిలర్ రమేశ్ కోర్టును ఆశ్రయించారు. మరోసారి విచారణ జరపాలని ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 21న లోకాయుక్త ఎస్పీని ఆదేశించింది.
ఆరు నెలలైనా కేసులో విచారణ జరగలేదు. కోర్టు ఉత్తర్వులపై సమాచారం లేదని, అందుకే విచారణ జరపలేదని విచారణ అధికారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తి సంతోశ్ గజానన్ భట్.. లోకాయుక్త పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు.
మరోవంక, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. దీంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే.. సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్లాన్ బీ సిద్ధం చేస్తునట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.