మెక్సికోతో సరిహద్దును కాపాడలేనివారు, ఉక్రెయిన్ సరిహద్దును కాపాడతారా అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. టెక్సాస్లోని కోన్రీలో శనివారం ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, ఇతరదేశాలపై దండయాత్ర గురించి మాట్లాడే ముందు అమెరికా సరిహద్దులకు భద్రత గురించి పట్టించుకోండి అంటూ హితవు చెప్పారు.
మెక్సికోతో తన సొంత సరిహద్దును కాపాడుకోవడం గురించి పట్టించుకోకుండా ఉక్రెయిన్ బోర్డర్ను కాపాడడం గురించి బైడెన్ ప్రభుత్వం ఎందుకింత హైరానా పడుతుందని ట్రంప్ ప్రశ్నించారు. శ్వేత సౌధంలో ఎవరిని కదిపినా ఉక్రెయిన్ సరిహద్దును రక్షించడమెలా అన్నదాని గురించే మాట్లాడుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
“ప్రపంచంలో అంతకంటే ముఖ్యమైన సరిహద్దు ఇప్పుడు మనకి ఉక్రెయిన్బోర్డర్ కాదు, అమెరికా సరిహద్దు” అని ట్రంప్ పేర్కొన్నారు. రికార్డు సంఖ్యలో వలసదారులు అమెరికా-మెక్సికో సరిహద్దుకు చేరుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీరు ఇలా దండెత్తి రావడం అమెరికా భద్రతకే ముప్పుగా పరిణమిస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇప్పటికే అమెరికా సరిహద్దును బైడెన్ వారికి అప్పగించేశారని మండిపడ్డారు. ‘ ఈ యుద్ధ రంగంలో అమెరికా ఓడిపోవడంతో యావత్ ప్రపంచం అమెరికాలోకే చొరబడుతోంది.’ అని పేర్కొన్నారు. ”ఇతర దేశాల దురాక్రమణల గురించి మన నేతలు మాట్లాడే ముందు ఈ దేశంపై దురాక్రమణను నిలువరించాల్సి వుందని” ట్రంప్ స్పష్టం చేశారు.