ఏపీలో సంచలనంగా మారిన ముంబై నటి కాదంబరి జెత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను చివరకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఉత్తరాఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన స్నేహితుడి మొబైల్ వినియోగించినా సాంకేతికత సాయంతో అరెస్ట్ చేశారు.
విద్యా సాగర్ను డెహ్రాడూన్లోని ఓ రిసార్ట్ దగ్గర శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై ఇవాళ విజయవాడకు తీసుకొస్తున్నారు. తనపై ఫోర్జరీ పత్రంతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ముంబై నటి ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్.. ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలు కీలకంగా ఉన్నారన్నారు. నటి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా కుక్కల విద్యాసాగర్ను చేర్చారు. ఆయనతో పాటుగా మరికొందరు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ముంబై నటి కేసులో తప్పుడు ఆధారాలను సృష్టించడంతో పాగుగా నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం.. పత్రాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు రికార్డులను తయారు చేయడంవంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 192, 211, 218, 220, 354 (డి), 467, 420, 469, 471 రెడ్ విత్ 120 (బి), ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు ముంబై నటి కేసులో ఆరోపణలు ఎదుక్కొంటున్న ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటా హైకోర్టును ఆశ్రయించారు. ముంబై నటి ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయాలని పోలీసులు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంతి రాణా పిటిషన్లో పేర్కొన్నారు.
నటి ఇబ్రహింపట్నం పోలీసులకు చేసిన ఫిర్యాదులో తనపై నిర్దిష్ట ఆరోపణలు లేవని.. ఆమెపై నమోదు చేసిన కేసు విషయమై నిర్వహించిన సోదాలు, ఆమె అరెస్టులో చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా తనను సెస్పెండ్ చేసిందని, పోలీసు విచారణకు అందుబాటులో ఉంటానని కోర్టుకు తెలిపారు. అలాగే కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. హైకోర్టు సోమవారం దీనిపై విచారణ జరిపే అవకాశం ఉంది.