దంపతులు విడిపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ ట్రాఫిక్ సమస్యల కారణంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో గణనీయ సంఖ్యలో విడాకులు తీసుకొంటున్నారని ఒక ప్రముఖ నేత భార్య చేసిన వాఖ్య వైరల్ గా వ్యాపిస్తుంది.
ముంబయిలో ట్రాఫిక్ కష్టాలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నగరంలో మూడు శాతం విడాకులకు ఇక్కడి ట్రాఫిక్ కష్టాలే కారణమని పేర్కొన్నారు. ముంబయి రోడ్లు, ట్రాఫిక్ కష్టాలపై మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘ముంబయిలో మూడు శాతం విడాకులు ట్రాఫిక్ జామ్ల వల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే వీటి కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు’ అని ఆమె తెలిపారు. రోడ్ల మీద గుంతలు, ట్రాఫిక్ చిక్కులతో తాను కూడా ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు.
‘నేను దేవేంద్ర ఫడ్నవిస్ భార్యననే విషయం మర్చిపోండి. ఒక సామాన్య మహిళగా మాట్లాడుతున్నా. రోడ్లు, గుంతల దారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను నేనూ ప్రత్యక్షంగా ఎదుర్కొన్నా’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అమృత వ్యాఖ్యలను ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ తప్పుబడుతూ ఆమె ప్రకటన పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ‘ ట్రాఫిక్ విడాకులకు దారి తీస్తోందన్న ఆమె ఆరోపణ ఆశ్చర్యకరంగా ఉంది. విడాకులకు చాలా కారణాలుండవచ్చు. అయితే నేను ఇలాంటి వ్యాఖ్య వినడం ఇదే మొదటి సారి’ అని ఆమె తెలిపారు.
శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. అమృత పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేసిన వారికి ‘ బెస్ట్ ఇల్లాజికల్ ఆఫ్ ది డే’ అవార్డు దక్కుతుందని అంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు వాసులు ఆ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, లేనిపక్షంలో మీ వైవాహిక జీవితాలు ఇబ్బందుల్లో పడతాయని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.