ఉక్రెయిన్ పై రష్యా బుధవారం దాడి చేయనున్నట్లు ఒక వంక ఆ దేశ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ, మరోవంక అమెరికా ప్రకటనలు చేస్తుండగా, అకస్మాత్తుగా రష్యా ఆ దేశ సరిహద్దుల్లో మోహరించిన తన సేనలు కొన్నింటిని వెనుకకు పిలిపించడం అందరికి విస్మయం కలిగిస్తున్నది.
ఈ మేరకు రష్యా రక్షణ శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని బేస్కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది? ఎందుకు రప్పించింది? అనే విషయాలపై స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా.. దౌత్యపరమైన చర్చల్లో భాగంగానే రష్యా ఈ నిర్ణయం తీసుకుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యాకు గత మూడు రోజులుగా ఈ వ్యవహారంలో జర్మనీ సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నది. జర్మన్ ఛాన్స్లర్ ఒలప్ స్కోల్జ్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దళాల వెనక్కి నిర్ణయం తీసుకుందేమోనన్న వాదనా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు పరిణామాలు రష్యా చేష్టలతో వేడేక్కుతున్నాయి. ఒకవైపు రష్యా బలగాల మోహరింపు చేస్తుంటే.. అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు మాత్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి.
కాగా, ఆహారం, నీరు నిల్వ చేసుకోవాల్సిందిగా ఉక్రెయిన్లోని ఫ్రెంచి పౌరులకు ఫ్రాన్స్ విజ్ఞప్తి చేసింది. రాబోయే రోజులు కష్టంగా సాగే అవకాశాలున్నందున ముందు జాగ్రత్త చర్యలు పాటించాలంటూ కీవ్లో పారిస్ రాయబారి ఎటినె డె పాన్సిన్స్ కోరారు. ప్రస్తుతమును పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్కు అన్ని రకాల పర్యటనలను వాయిదా వేసుకోవాల్సిందిగా పర్యాటకులను కోరారు.
కాగా, ఉక్రెయిన్లో నివసించే భారతీయులు వీలయితే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన చేసింది.‘ఉక్రెయిన్లోని అస్థిర పరిస్థితులను భారతీయులు దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇక్క డ ఉండాల్సిన అవసరం లేని విద్యార్థులు తాత్కాలికంగా దేశం వీడే అవకాశాన్ని పరిశీలించాలి’ భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది.
అలాగే భారతీయలు ఉక్రెయిన్కు రావడం, ఆ దేశంలోపల అత్యవసరం కాని ప్రయణాలను మానుకోవాలని కూడా ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటికే పలు దేశాలు తమ దేశస్థులను ఉక్రెయిన్నుంచి వెనక్కి వచ్చేయాలని ఆదేశించాయి. ఈ జాబితాలో అమెరికా,జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్,కెనడా, నార్వే, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్, సౌదీ, యుఎఇ తదితర దేశాలున్నాయి.
కాగా ఉక్రెయిన్లోని భారతీయులనుఆదుకుంటామని, అవసరమైన సహాయ, సమకారాలను అందజేస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్లోని పరిస్థితులను పర్యవేక్షిస్తోందని, అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయ, సహకారాలు అందజేస్తామని విదేశాంగ శాఖ సహాయమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.
‘కావలసిన మార్గదర్శకాలు జారీ చేశాం. దీంతో ఉక్రెయిన్లోని భారతీయులకు కచ్చితమైన సమాచారం అందుతుంది. మా హాట్లైన్లు, ఇమెయిల్స్ అన్నీ పని చేస్తున్నాయి. మన రాయబార కార్యాలయం పూర్తి స్వింగ్లో పని చేస్తోంది. దేశాన్ని వీడడం కానీ, ఇతర సహాయ, సహకారాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మీనాక్షి లేఖి వెల్లడించారు.
భారతీయులు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉంటూ వారి వివరాలను పంచుకోవాలని ఆమె కోరారు. ఉక్రెయిన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ముఖ్యంగా ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.`