కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం అధికారంలో ఉన్న బీజేపీకన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటంలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై ఏమి మాట్లాడినా చివరకు బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందనే సందిగ్ధలో పడ్డారు.
అందుకనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో హిజాబ్ వివాదంను కాకుండా హిందుత్వ గుర్తయిన కాషాయ జెండా ఏదో ఒకరోజు దేశంలో జాతీయ పతాకంను భర్తీ చేస్తుందని అంటూ సీనియర్ మంత్రి కె ఎస్ ఈశ్వరప్ప చేసిన వాఖ్యలపై రసభ చేస్తున్నారు.
ఫిబ్రవరి 18న బెంగళూరులో కాంగ్రెస్ విలేకరుల సమావేశానికి ముందు, పార్టీ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యకు హిజాబ్పై ముస్లిం సమాజంలో ఉన్న సందేహాలను తొలగించడానికి ఉర్దూ మీడియాను ఉద్దేశించి ప్రసంగించాలని సూచించారు.
మైక్రోఫోన్ల ద్వారా జరిగిన తదుపరి సంభాషణలో, మాజీ ముఖ్యమంత్రి ఇలా సమాధానమిచ్చారు: “కెపిసిసి (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ (డి కె శివకుమార్) రానివ్వండి. పార్టీని కలుపుకుపోదాం, లేకుంటే సిద్ధరామయ్య మాత్రమే ఈ అంశాన్ని లేవనెత్తినట్లు అర్థం అవుతుంది” అంటూ ఆ విషయమై మాట్లాడేందుకు విముఖత చూపారు.
రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లోకి హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలను ప్రవేశించకుండా నిరోధించడంపై రగులుతున్న వివాదం మధ్య, ఈ అంశంపై ముస్లిం సమాజానికి మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ డైలమాలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటక జనాభాలో ముస్లింలు దాదాపు 10 శాతం ఉన్నారు.
ముస్లిం బాలికల చదువును అడ్డుకోవడం కోసమే విద్యాసంస్థలలో హిజాబ్పై ఆంక్షలు విధించారని ఆ పార్టీ ముస్లిం నేతల ఆదేశం మేరకు సిద్ధరామయ్య ఫిబ్రవరి 4న చెప్పినప్పటికీ, అధికార బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేయడంతో ఆ పార్టీ మౌనం వహిస్తున్నది. ఈ విషయంపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం తొలుత పార్టీ నేతలపై ఆంక్షలు పెట్టింది.
గత వారం, ముస్లిం కాంగ్రెస్ ఎమ్మెల్యే, జమీర్ అహ్మద్, మహిళల గౌరవం కాపాడడానికి ఇస్లాంలో హిజాబ్ అవసరమని అనుకూలంగా మాట్లాడితే, అతడిని మందలించి, క్షమాపణ చెప్పే విధంగా చేశారు. “ఈ సమస్యపై వ్యాఖ్యానించవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరాము. కాని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆదేశం’ అని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వ్యంగ్యంగా మాట్లాడుతూ.. ”హిజాబ్ విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే చీలిక ఉందని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. హిజాబ్ అనుకూల వైఖరి తీసుకొంటే పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని ఒక వర్గం భావిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించకపోతే ముస్లిం ఓట్లను కోల్పోతామన్న భయం కూడా వారికి ఉంది. ఫలితంగా వారు ఈశ్వరప్ప వ్యాఖ్యల అంశాన్ని బయటకు తీసుకువచ్చారు” అని విమర్శించారు.
ఈ సమస్యలపై మైనారిటీలకు బహిరంగంగా మద్దతివ్వకూడదని, ఏది చేసినా లోపాయికారిగా చేయాలని, లేకుంటే అది బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోతుందని భావిస్తున్నామని కాంగ్రెస్ యువ నాయకుడు ఒకరు చెప్పారు. అందుకనే విద్యాసంస్థలకు హిజాబ్ తో వెళ్లే ముస్లిం బాలికలపై ఆంక్షలు తొలగించే విధంగా చేయడం కోసం లోపాయికారిగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై , విద్యా మంత్రి బి సి నగేష్ లతో బ్యాక్-ఛానల్ చర్చలు నిర్వహిస్తున్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్ అహ్మద్, ఎమ్మెల్యేలు, యుటి ఖాదర్, జమీర్, తన్వీర్ సైత్, రిజ్వాన్ అర్షద్, ఎన్ ఎ హరీస్, కనీజ్ ఫాతిమా, ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్తో సహా తమ ముస్లిం నేతలకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అధికారం ఇచ్చింది.
‘‘పార్టీ అధ్యక్షుడు శివకుమార్, నేను మైనారిటీల ప్రతినిధులతో కలిసి సీఎం బొమ్మైని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరాం. ఎవరికీ విద్యను నిరాకరించకూడదనేది మా ఆందోళన,” అని ఫిబ్రవరి 18న శివకుమార్తో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. హిజాబ్పై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి.