అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని అమ్నెస్టీ ఇండియా మాజీ చైర్మన్ ఆకార్ పటేల్ను ఢిల్లీ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. అమెరికాకు వెళ్ళబోతుండగా ఆయనను ఆపినందుకు ఆయనకు తక్షణమే లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని సీబీఐని ఆదేశిస్తూ గురువారం స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేసింది.
ఆకార్ పటేల్ బుధవారం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయనను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నిలిపేసింది. అనంతరం ఆయన స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు స్పెషల్ కోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను పక్కనపడేసింది.
దీనిపై సెషన్స్ కోర్టులో సీబీఐ అపీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు తీర్పు చెప్తూ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్ళవద్దని ఆకార్ పటేల్ను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారం జరుగుతుందని తెలిపింది. స్పెషల్ కోర్టు తీర్పు అనంతరం ఆకార్ పటేల్ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా గురువారం రాత్రి మరోసారి సీబీఐ ఆయనను అడ్డుకుంది.
దీంతో ఆయన సీబీఐ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వారంలో ఏడు రోజులు, రోజులో 24 గంటలు అందుబాటులో ఉండవలసిన సీబీఐ వంటి ఏజెన్సీ కోర్టు ఆదేశాలపై నిర్లిప్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకుందన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ‘‘తక్షణమే’’ అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ సీబీఐ తగిన విధంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.
తాను ఏప్రిల్ 7 రాత్రి 11 గంటలకు అమెరికాకు బయల్దేరుతున్నట్లు సీబీఐకి తెలిసినప్పటికీ కోర్టు ఆదేశాలపై ఉదాసీనంగా వ్యవహరించిందని తెలిపారు. సీబీఐ అధికారి అందుబాటులో లేకపోవడాన్నిబట్టి, కోర్టు ఆదేశాన్ని అమలు చేయరాదని ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు.
కాగా, స్పెషల్ కోర్టు ఆదేశాలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు తమకు అందాయని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆదేశాల అమలుకు కోర్టు తమకు 24 గంటల సమయం ఇచ్చిందని పేర్కొన్నాయి.