తాను పదవిలో లేకపోతేనే చాలా ప్రమాదకరం అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానని హెచ్చరించారు. అధికారం కోల్పోయిన అనంతరం మొదటిసారిగా పెషావర్లో బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు.
తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదని, కానీ ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారుతానని స్పష్టం చేశారు. దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష పార్టీల సహాయంతో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు.
ఆదివారం నుండి ప్రారంభమైన ర్యాలీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల తమ వైఖరిని తెలిపారని పేర్కొన్నారు.
ప్రతిసారీ ఒక ప్రధాన మంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు కానీ తనను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే తనను పదవి నుండి తొలగించే సమయంలో శనివారం అర్ధరాత్రి వరకు న్యాయస్థానం తలుపులు ఎందుకు తెరిచి ఉంచారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ తనకు 45 సంవత్సరాలుగా తెలుసునని, తాను ఎప్పుడైనా చట్టాన్ని ఉల్లంమ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డానని ఆరోపించారా? అని సూటిగా ప్రశ్నించారు. తాను క్రికెట్ ఆడినప్పుడు ఎవరైనా తనను ప్రశ్నించారా? అని నిలదీశారు.
కాగా, తాను ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగడంతో భారత్, ఇజ్రాయెల్ ఎక్కువగా సంబరాలు చేసుకున్నాయంటూ ఈ సందర్భంగా పొరుగుదేశంపై తన అక్కసు గ్రక్కారు. “ఈ బందిపోట్లను (భారత్, ఇజ్రాయిల్) రుద్దడం ద్వారా పాకిస్థాన్ను అమెరికా అవమానించింది” అంటూ మండిపడ్డారు.