ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టిసి టిక్కెట్ ధరలను గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచడంతో ప్రయాణికులపై పెనుభారం పడింది. ఆర్టిసి యాజమాన్యం పెరిగిన ధరల భారం రూ.720 కోట్లు అని చెబుతున్నా.. వాస్తవంగా రూ.1500 కోట్లకు పైబడి ఉందని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు.
గతంలో కిలోమీటరు తరహాలోనే పెంచితే ఇప్పుడు కిలోమీటర్పై పెంచుతూనే సెస్ల రూపేణా భారీగా పెంచారు. ఇప్పుడు ప్రయాణికుడికి ఇచ్చే టిక్కెట్పై కూడా సెస్ పేరుతో భారం వేశారు. కనీస ఛార్జీలు, ప్రయాణం సెస్, భద్రత సెస్, టోల్ ఛార్జీలతోపాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఇచ్చే సీజనల్ పాస్ల ధరలను భారీగా పెంచారు.
డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులో టిక్కెట్కు రూ.2, ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, సిటి మెట్రోలలో రూ.5, సూపర్ లగ్జరీ, ఎసి బస్సుల్లో రూ.10 చొప్పున పెంచారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 73 పైసలుంటే ఇప్పుడు 83 పైసలకు పెంచారు.
అల్ట్రా పల్లె వెలుగుకు 82 పైసలుంటే 92 పైసలు చేశారు. సూపర్ లగ్జరీలకు రూ.1.46 ఉంటే 1.56 అయ్యింది. ఇంద్ర, గరుడ, అమరావతి లాంటి ఎసి సర్వీసులకు కూడా కిలోమీటరుకు 10 పైసలు చొప్పున అధనంగా పెంచారు.
రాష్ట్రంలో 11,359 బస్సుల్లో సగటున 45 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని, డీజిల్ సెస్ను టిక్కెట్పై సగటున రూ.5 అనుకున్నా దాదాపు సెస్ రూపేణానే రూ.820 కోట్ల దాకా భారం పడుతుంది. అయితే అధికారులు మాత్రం రూ.720 కోట్లు అని ప్రకటన చేశారు. అలాగే బస్సుల్లో కనీస ఛార్జీలను రెండింతలు చేశారు.
ఇప్పటి వరకూ ఆర్డినరీ బస్సుల్లో రూ.5 ఉంటే ఇప్పుడు రూ.10 చేశారు. ఎక్స్్ప్రెస్ సర్వీసుల్లో రూ.10 నుంచి రూ.20కు పెంచారు. ప్రయాణం సెస్ ఎక్స్ప్రెస్లకు రూ.2 ఉంటే దాన్ని రూ.5కు పెంచారు. ఎసి బస్సుల్లో రూ.3 ఉంటే రూ.5కు పెంచారు.
భద్రత సెస్ను కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రతి టిక్కెట్పై రూ.1ను వసూలు చేస్తారు. వీటికి తోడు టోల్గెట్ ఛార్జీ రూపేణా కూడా భారం వేశారు. సిటీ ఆర్డినరీలకు ఇప్పటి వరకూ రూ.4 ఉంటే రూ.5 చేశారు. ఎసి బస్సులకు రూ.8 నుంచి రూ.9కు పెంచారు.
ఉద్యోగులకు, విద్యార్థులకు నెలవారీ ఇచ్చే పాస్ల ఛార్జీలను పెంచారు. ఇప్పటి వరకూ ఆర్డినరీ బస్సుల్లో రూ.870 ఉంటే అది ఇప్పుడు రూ.1,010 అయ్యింది. మెట్రో ఎక్స్ప్రెస్లో రూ.990 ఉంటే రూ.1,140కు, ఎన్జిఒ ఆర్డినరీ పాస్ను రూ.290 నుంచి రూ.340కు, ఎన్జిఒ మెట్రో ఎక్స్ప్రెస్కు రూ.410 నుంచి రూ.480కు, సచివాలయ పాస్లు రూ.530 నుంచి రూ. 610కు పెంచారు.
ఇలా అన్ని రకాలుగా ప్రయాణికులపై ఆర్టిసి భారాలు వేసింది. సగటున 45 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు బుధవారం ఆర్టిసి యజమాన్యం ప్రకటించినా వాస్తవంగా 60 లక్షల మందికి పైగానే ప్రయాణికులు సగటున ప్రయాణిస్తారని గతంలో అనేక నివేదికల్లో ఆర్టిసి పేర్కొంది.
ఈ లెక్కన టిక్కెట్పై ఇప్పుడు విధించిన సగటు రూ.5 సెస్ను లెక్క కట్టినా రోజుకు సగటున రూ.మూడు కోట్లకు పైగానే ప్రయాణికులపై భారం పడుతుంది.