పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేష్(25) మృతిచెందడంతో ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది. సాయిగణేశ్ మృతికి పోలీసులతో కలసి వేధించిన స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్పొరేటర్ కన్నం వైష్ణవి భర్త ప్రసన్న కృష్ణ, పోలీసులు కారకులంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
సాయి గణేష్ మృతికి సంబంధించి మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదని ధ్వజమెత్తారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసుల వేధింపులు భరించలేక ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, మంత్రిపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ఖమ్మంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆందోళనలకు దిగడం, ప్రభుత్వాస్పత్రి అద్దాలు ధ్వంసం చేయడం, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను దహనం చేయడం, ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను నియంత్రించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ మజ్దూర్ సంఘ్ జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సామినేని సాయిగణేశ్పై ఏడాది కాలంలో ఖమ్మం పట్టణంలోని పలు పోలీస్స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల ఆయన నివాసం ఉంటున్న 46వ డివిజన్లోని జూబ్లీక్లబ్ వెనుక బీజేపీ జెండా గద్దెను నిర్మించగా, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని కూల్చివేశారు. ఇదేమిటని సాయిగణేశ్ నిలదీయడంతో గొడవ జరిగింది.ఈ క్రమంలో ఆయనపై త్రీటౌన్ పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్ తెరిచారు.
అయితే పోలీసులు తనను తరచూ స్టేషన్కు రావాలంటూ వేధిస్తున్నారని, బయట తిరిగితే ఎవరూ కాపాడలేరంటూ భయపెట్టారని చెప్తూ సాయిగణేశ్ ఆందోళనకు గురయ్యాడు. ఈ నెల 14న త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. పోలీసులు తొలుత ప్రభుత్వాస్పత్రికి, తర్వాత స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు సాయిగణేశ్ మృతదేహం ఆస్పత్రికి చేరుకున్నా 3 గంటల వరకు కూడా పోస్టుమార్టం జరగలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, అధికారపార్టీ నేతల తీరుపై మండిపడుతూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
సాయిగణేశ్ చిన్నతనంలోనే తండ్రి వెంకటేశ్వరరావును కోల్పోయారు. గతేడాది కరోనా సమయంలో తల్లి మంజుల కన్నుమూశారు. ఈ క్రమంలో సాయిగణేశ్కు వివాహం కుదిర్చిన బంధువులు మే 4న ముహూర్తం ఖరారు చేశారు. వివాహ ఏర్పాట్లలో ఉండగానే అతను తనువు చాలించడం కుటుంబంలో విషాదాన్ని నింపింది.
మంత్రి పువ్వాడ అజయ్, ఇతర నేతల ఫ్లెక్సీలు, కటౌట్లను చించేసి, దహనం చేశారు. ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. దీనితో హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు కార్యకర్తలకూ దెబ్బలు తగిలాయి.
పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇక సాయిగణేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయి.. అంతిమయాత్ర నిర్వహిస్తుండగా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇలా ఉండగా, ఖమ్మం నగరంలో శనివారం బిజెపి కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై మొత్తం 16 మందిపై పోలీసులు మూడు కేసులను నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో కోపొద్రిక్తులైన బిజెపి కార్యకర్తలు శనివారం ఖమ్మం నగరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని అద్దాలను, ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఇల్లెందు క్రాస్రోడ్డులో ఆర్టీసి బస్సుల అద్దాలను పగులగొట్టడం, మమత ఆసుపత్రి రోడ్డులో మంత్రి కెటిఆర్, పువ్వాడ కటౌట్లకు నిప్పు పెట్టిన సంఘటనపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏపూరి నాగేశ్వర్రావు, పా పారావు సహా మొత్తం 16 మందిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సిఐ శ్రీధర్ తెలిపారు.
అదేవిధంగా బిజెపి కి చెందిన కార్యకర్త వేల్పుల చంద్రశేఖర్పై దాడి చేసిన సం ఘటనపై టిఆర్ఎస్ కార్యకర్తలపై కూడా మరో కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం