తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణాన్ని దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని లక్షంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించాయిరు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన సచివాలయ నిర్మాణాన్ని పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణాలను పరిశీలించిన కెసిఆర్, పలు అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అందుకు తగట్లు కార్యాచరణను నిర్దేశించుకోవాలని ఉన్నతాధికారులను, గుత్తేదారులను ఆయన ఆదేశించారు. నూతన సచివాలయ భవనం అత్యాధునిక వసతులతో అన్ని హంగులతో నిర్మిస్తున్నామని చెబుతూ దేశంలోని అన్ని సచివాలయాలకు రోల్డ్ మాడల్గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఫిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను, వాటి నాణ్యత గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను ఆయన కలియతిరిగారు. ఈ గదుల్లో వెంటిలేషన్ బాగా వస్తుందని కెసిఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీ గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు.
రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సరఫరా గురించి సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. ఫిల్లర్ల డిజైన్లకు సంబంధించి పలు మార్పులు సూచించారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి అందంగా ఉండేలా చూడాలని సిఎం అధికారులకు సూచనలు చేశారు.
సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.
బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. సచివాలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను అభినందించారు.