గురుకులాల్లో చదివే విద్యార్థులు బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి విద్య, ఆహారం, వసతి… ఇవీ గురుకులాల్లో విద్యార్థులకు అందించాల్సినవని ఆమె చెప్పారు. అయితే, చదువు పరిస్థితి ఎలా ఉన్నా… చాలాచోట్ల భద్రత గాలిలో దీపం అన్నట్లుందని ఆమె విమర్శించారు.
అపరిశుభ్ర వాతావరణం, కనీస జాగ్రత్తలు కొరవడడంతో రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థులు పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారని ఆమె తెలిపారు. చదువుకుందామని వస్తే ప్రాణాలే పోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె ధ్వజమెత్తారు.
వంట గది శుభ్రతను విస్మరిస్తుండడం, కుళ్లిన ఆహార పదార్థాలు కూరగాయలను వంటకు ఉపయోగిస్తుండడంతో తరచూ ఎక్కడో ఒకచోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని విజయశాంతి చెప్పారు. మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తల్లిదండ్రులు పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తుంటే.. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోందని ఆమె మండిపడ్డారు.
నల్లగొండ జిల్లా దామరచర్లలోని గురుకులంలో కలుషితాహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన మరవకముందే, మరో ఆరుగురిని ఎలుకలు కొరికిన విషయం బయటపడిందని ఆమె గుర్తు చేశారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన ఉన్నా చాలా గురుకులాల్లో ఇది మచ్చుకైనా కనిపించని పరిస్థితి కనిపిస్తోందని ఆమె విమర్శించారు.
కొన్నిచోట్ల సరైన వసతి సదుపాయాలు లేకపోవడంతో పాఠాలు విన్న గదిలోనే విద్యార్థులు రాత్రి నిద్రించాల్సిన దుస్థితి నెలకొందిని ఆమె చెప్పారు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానం చేసేందుకు విద్యార్థులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందిని పేర్కొన్నారు. పైగా, విద్యార్థుల తినే ఆహారంలో తక్కువ ధరకు లభించే, నాసిరకం పప్పు దినుసులు, కూరగాయలు, ఇతర పదార్థాలు వాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.