పాకిస్థాన్ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేర్లను నమోదు చేసుకోవద్దని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటీఇ) ఇక్కడి విద్యార్థులను హెచ్చరించాయి. దీన్ని ఉల్లంఘిస్తే భారత్లో పై చదువులకు, ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్కు వెళ్లొద్దని తేల్చి చెప్పింది.
పాకిస్థాన్లోని డిగ్రీ కాలేజీల్లో ఎన్రోల్ చేసుకున్నవారు అక్కడ పొందిన డిగ్రీ పట్టా ఆధారంగా భారత్లో ఉద్యోగం చేయడానికి, ఉన్నత విద్యనభ్యసించడానికి అర్హులు కారు అని వివరించాయి. భారత విద్యార్థులు విద్యనభ్యసించడానికి పాకిస్థాన్కు వెళ్లద్దని కేంద్ర ఉన్నతవిద్యా మండలి సూచించింది.
భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీలను పొంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఎఐసిటిఇ చైర్మెన్ అనిల్ సహస్రబుద్ధే తెలిపారు. భారత్ వెలుపల విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ మార్గదర్శకాలను జారీ చేశామని యూజీసీ చైర్మెన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.
భారత పౌరులు, ‘ఓవర్సీన్ సిటిజన్ ఆఫ్ ఇండియా’ విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే పాక్ నుంచి భారత్కు వలస వచ్చిన వారు, వారి పిల్లలు ఇక్కడి పౌరసత్వం పొంది ఉంటే ఇక్కడి ఉద్యోగాలకు అర్హులేనని స్పష్టం చేసింది. అయితే వారు కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని సూచించింది.
ఇటీవల కొంతమంది విదేశాల నుంచి తిరిగొచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో గమనించామని గుర్తు చేశారు. పరోక్షంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల సమస్యలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని విద్యాసంస్థల్లోనూ విద్యనభ్యసించడాన్ని నిషేధిస్తూ 2013 లో యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా చైనాలోని భారత విద్యార్థులకు కరోనా సమయంలో వీసా జారీకి నిరాకరించడం జరిగింది.
గతేడాది జులై 22న కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. విదేశాల్లో చదువుతున్న మొత్తం 11,33,749 మంది విద్యార్థుల్లో 230 మంది పాకిస్థాన్లో విద్యనభ్యసించారు.