అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.. ఆ కుటుంబాలు పలుకరించే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్న వేళ ‘నేనున్నానం’టూ జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చేసిన కౌలు రైతు భరోసా యాత్ర ధైర్యాన్ని నింపుతూ సాగింది.
ఇటీవల అనంతపురం జిల్లాలో 30 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పవన్.. శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డున పడిన అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పించారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుబాల కష్టాలు ఆలకించారు.
కౌలు రైతుల కన్నీరు తుడిచేందుకు జనసేన పార్టీ ఉందన్న ధైర్యాన్ని నింపారు. ఇంటింటికీ వెళ్లి కష్టాల్లో ఉన్న ఆ కుటు-ంబాలను పలకరిస్తూ.. ఆత్మహత్యలకు కారణాలను ఓపికగా ఆలకించారు. కౌలు రైతులను అదుకుంటామంటే ప్రజలు నమ్మి సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే వైసిపి ప్రభుత్వం నట్టేట ముంచిందని, కౌలు రైతు కుటుంబాలను రోడ్డున పడేసిందని పవన్కల్యాణ్ మండిపడ్డారు.
వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే జనసేన ఇలా రోడ్డెక్కెదే కాదని చెబుతూ హామీలు అమలు చేయలేని వారు ఎందుకు నమ్మించారని ప్రభుత్నాన్ని ప్రశ్నించారు. తనను దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సిబిఐ దత్తపుత్రుడు అంటారని స్పష్టం చేస్తూ ఇక ముందు తనను దత్తపుత్రుడు అంటే ఆయనను సిబిఐ దత్తపుత్రుడు అనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడో స్థానంలో, కౌలురైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని చెప్పారు.
సమాజానికి అన్నం పెట్టే కౌలు రైతులకు న్యాయం చేయలేనప్పుడు ఈ సచివాలయాలు, ప్రభుత్వ సేవలు ఎందుకని ప్రశ్నించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరియా వంటి రసాయనాల ధరలు మరింత పెరిగి ఆత్మహత్యలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని పెద్దలు, ఐఎఎస్లు అధ్యయనం చేసి కౌలు రైతులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఆరుగురి కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.
తొలుత ఏలూరు నుంచి అనంతరం పెదవేగి, లింగపాలెం, చింతలపూడి మండలాల్లోని మృతి చెందిన కౌలురైతుల కుటుంబాల ఇళ్లకు పవన్ వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపుడి గోవిందరావు, నాయకులు పాల్గన్నారు.