దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదని, దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని, భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పిలుపిచ్చారు.
బుధవారం పార్టీ 21వ ప్లీనరీలో మాట్లాడుతూ దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం అని చెప్పారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్న కేసీఆర్.. అందులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
“2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే, ఏం పని లేదా అని అన్నారు. కానీ, తెలంగాణ సాధించడమే కాకుండా దేశానికి రోల్మోడల్గా తెలంగాణ నిలిచేలా చేశాం. సమైక్య పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు పోయేవారు. ఇవాళ వలసలు రివర్స్ వచ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మన వద్దకు వలసలు వస్తున్నారు” అని కేసీఆర్ గుర్తు చేశారు.
బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్మిల్లులు నడవవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారు. దేశాన్ని ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా నేడు కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలని చెప్పారు.
“నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుపడతది” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దుర్మార్గంగా గవర్నర్ వ్యవస్థ
దేశంలో గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారని గుర్తు చేశారు. తమిళనాడులో పంచాయితీ, బెంగాల్లో సైతం పంచాయితీ నడుస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్పై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థను గద్దె దించారని గుర్తు చేశారు. అదే ఎన్టీఆర్ను ప్రజలు తిరిగి గద్దెను ఎక్కించారని చెప్పారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరగాలని కేసీఆర్ పిలుపిచ్చారు.
కత్తులు, తుపాకులు పట్టుకోవడం రాజ్యాంగ స్ఫూర్తా?
కొందరు రాజకీయ స్వార్థం కోసం…పది మందికి పదవులను దక్కించుకునేందుకు దేశంలో మత పిచ్చి లేపుతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరకాదని స్పష్టం చేశారు. కర్ణాటకలో హిజాబ్, హలాల్ వివాదాలు జరుగుతుండటంపై దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరులో ప్రత్యక్షంగా 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, పరోక్షంగా మరో 30 లక్షల మంది బతుకుతున్నారని గుర్తు చేశారు. మత విద్వేషాలు ప్రేరేపించేవారు ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన 13 కోట్ల మంది ప్రజలు స్వదేశానికి తిరిగి వస్తే పరిస్థితి ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. గాంధీని విమర్శించి ఆయన్ని చంపిన వారిని ప్రశంసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ రాజధానిలో కత్తులు, తుపాకులు పట్టుకుని మృగాలుగా తిరగడం రాజ్యాంగ స్ఫూర్తా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యంగం అమలు కావాలంటే దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మానిన గాయాలను మళ్లీ మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని కశ్మీర్ పండిట్స్ మాట్లాడుతున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి
టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచం అని తెలిపారు. రాష్ట్రానికి టీఆర్ఎస్ పెట్టని కోట అని..దాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరని కేసీఆర్ భరోసా వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఓటములు…గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.
60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో..వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 తెలంగాణవే ఉన్నాయని తెలిపారు. అవార్డులు, రివార్డులు రాని శాఖలు తెలంగాణలో లేనేలేదని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేసీఆర్ తెలిపారు.