పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ బుధవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో బిలావల్ పాత్రపై గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు దీంతో తెరపడింది.
అధ్యక్ష నివాసం ఐవాన్ ఇ సదర్లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో 33 ఏళ్ల బిలావల్ చేత విదేశాంగ మంత్రి పాక్ అధ్యక్షుడు ఆలిఫ్ అల్వి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)కి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు.
2018లో జాతీయ పార్లమెంట్కు మొదటిసారి ఎన్నికైన బిలావల్కు అత్యంత కీలకమైన విదేశాంగ మంత్రి పదవి దక్కడం విశేషం. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం కూడా ఇదే మొదటిసారి. పాకిస్తాన్కు మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్. 2007లో రావల్పిండిలో ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన బాంబు దాడిలో బేనజీర్ భుట్టో మరణించారు. బేనజీర్ తండ్రి మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో.
రంజాన్ తర్వాత పాక్కు నవాజ్ షరీఫ్
ఇలా ఉండగా, పదవీచ్యుతికి గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోర్టు విచారణను ఎదుర్కోవడానికి వచ్చే నెల రంజాన్ పండుగ తర్వాత లండన్ నుంచి పాక్ తిరిగిరానున్నట్లు పిఎంఎల్-ఎన్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగిరావడానికి పాక్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం మంగళవారం పాస్పోర్టు జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ప్రభుత్వం అనేక అవినీతి కేసులను నమోదు చేయడంతో వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి లాహోర్ హైకోర్టు నాలుగు వారాల అనుమతి ఇవ్వడంతో 72 ఏళ్ల పిఎంఎల్-ఎన్ అధినేత 2019 నవంబర్లో లండన్ వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు.
కాగా..రంజాన్ పండుగ తర్వాత నవాజ్ షరీఫ్ స్వదేశానికి తిరిగివచ్చి పాకిస్తాన్లో బహిరంగ సభలను నిర్వహిస్తారని ఫెడరల్ మంత్రి మియాన్ జావేద్ విలేకరులకు తెలిపారు. స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే ఆయనను అరెస్టు చేయకపోతే మే 6 నుంచి నవాజ్ షరీఫ్ రాజకీయ ర్యాలీలను నిర్వహిస్తారని ఆయన చెప్పారు.