ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ కాకుండా, అడ్డదిడ్డంగా అప్పులు తీసుకు రావడం కోసమే తమను ఉపయోగించుకొంటూ ఉండడంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖలో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఇక తాను ఈ ప్రభుత్వంలో పనిచేయలేనని నిర్ణయానికి వచ్చారు. తనను తెలంగాణకు బదిలీ చేయమని విజ్ఞాపన పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఆర్థికశాఖలో ప్రస్తుతం నలుగురు అఖిల భారత సర్వీసు అధికారులు పనిచేస్తున్నారు. వారందరికీ అధిపతి కావడంతో రావత్ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అడ్డదిడ్డంగా జరుగుతున్న ఏపీ ప్రభుత్వం ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ గురించి కేంద్రం వరుసగా సంజాయిషీ లేఖలు వారిస్తుంటే, వాటికి సమాధానాలు ఇవ్వలేక, ఇచ్చిన సమాధానాలతో కేంద్రం సంతృప్తికి చెందక ఇరకాటంలో పడుతున్నారు.
అదనపు అప్పుకు అనుమతికోసం గత వారం అంతా ఆర్ధిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డితో కలసి ఢిల్లీలో పడిగాపులు కాసిన ఆయనను కేంద్రంలోని ఉన్నతాధికారులు ఆర్ధిక మంత్రిని బయట కూర్చోమని, తీవ్రంగా మొట్టికాయలు వేసిన్నట్లు తెలుస్తున్నది. “మంత్రులు ఏమైనా చేస్తుంటారు. మీరు ఉన్నతాధికారులుగా అడ్డదిడ్డంగా చేస్తే ఎట్లా?” అంటూ సున్నితంగా మందలించినట్లు చెబుతున్నారు.
దానితో అవమానభారంతో, అమరావతికి తిరిగి రాగానే వారం రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ వత్తిడులను తట్టుకోలేక ఆయన తెలంగాణకు వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుత ఏపీలో పరిస్థితిలో ఆర్థికశాఖను నిర్వహించడం కన్నా, అటు కేంద్రానికి గానీ, ఇటు తెలంగాణకు గానీ వెళ్లడం ఉత్తమమన్న భావాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా రావత్ సతీమణి హైదరాబాద్లో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్న నేపథ్యంలో తనను కూడా స్పౌస్ విభాగంలో హైదరాబాద్కు బదిలీ చేయాలని చాలాకాలంగా రావత్ కేంద్రాన్ని కోరుతున్నారు. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్లు తెలిసింది.
ఇలా ఉండగా, ఐఆర్ఎఎస్ అధికారి కెవివి సత్యనారాయణ రాష్ట్ర ఆర్థికశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. శాఖలో ఆయన కీలకమైన బడ్జెట్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఐదేళ్ల కాలానికి డిప్యుటేషన్పై వచ్చిన ఆయన పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి పొడిగింపునకు ప్రయత్నిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.