దేశ వ్యాప్తంగా వేసవి నిప్పులు చెరుగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నది. మార్చ్ లో సగటు ఉష్ణోగ్రత ఇటీవల దేశ చరిత్రలోనే అత్యధికం అని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాలలో వచ్చే ఐదు రోజులు వడగాల్పులని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకొంటున్నది.
ఇక ఏపీలో సాధారణ ఉష్ణోగ్రతలను దాటి 43, 44 డిగ్రీలను తాకింది. ఈ నెల 26న అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం 27, 28 తేదీల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి.
గురువారం కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం కాలుగొట్లలో అత్యధికంగా 44, పంచలింగాలలో 43.7 డిగ్రీలు, బనగానపల్లె మండలం నందవరం, ఆళ్లగడ్డలోని అహోబిలంలో 43 డిగ్రీలు నమోదయ్యాయి. కరూులు జిల్లా శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల మధ్యనే గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ నెల 27న అనకాపల్లి జిల్లా చోడవరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాల పరిసరాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయినిమించిపోయాయి. విశాఖపట్నంలో అత్యల్పంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజుల వరకూ 38 డిగ్రీలలోపే ఉష్ణోగ్రత నమోదవ్వగా.. తాజాగా 41కు చేరింది.
అనంతపురంలో 43, కర్నూలు, జంగమేశ్వరపురంలో 43 ఉష్ణోగ్రతలు కొనసాగాయి. మండల పరిసరాలు, గ్రామాల్లోనూ ఇదే తరహా వేడి గాలులు, ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు, ప్రకాశం జిల్లా డోర్నాలలోని పెదడోర్నాల, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసంపేట కోవిలం, విజయనగరం జిల్లా చీపురుపల్లి, విజయనగరం, బబ్బిలి, గజపతినగరం ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా, యుపి, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గురువారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగాల్పులు వీచే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది.
వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారత్లో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత ఈ వేడి తగ్గవచ్చునని పేర్కొంది.
ఆ ఐదు రాష్ట్రాల్లోనిపలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినందున.. వడగాల్పులు వీచే అవకాశాలెక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల్లో కూడా 45 డిగ్రీలకుపైగా ఉష్ణ్గోగ్రతలు నమోదయ్యాయి. జమ్ముకాశ్మీర్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.