బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలు ఇప్పుడు కనివిని ఎరుగని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజుకు దాదాపు 11 గంటలు అంతకు మించి అధికారిక విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు.
ప్రత్యేకించి ఎప్రిల్ రాకముందే మార్చి నెల మధ్యనుంచే అత్యధిక స్థాయిలో ఎండలు మండాయి. దీనితో కుటుంబాలలో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతూ రావడం, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన ముడి ఇంధన సరుకు బొగ్గు సకాలంలో చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోతూ ఉండటంతో ప్రధాన విద్యుత్ పంపిణీ కేంద్రాలకు వాటి అవసరాల మేరకు విద్యుత్ను సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది.
తరిగిపోతున్న విద్యుత్ సామర్థం, ముందు చూపులేని వైఖరి, బొగ్గు నిల్వలు ఉన్నా సాంకేతిక కారణాలతో వాటిని థర్మల్ కేంద్రాలకు చేర్చలేని స్థితితో దేశంలో ఇప్పుడు 10 రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఆ రాష్ట్రాలు : 1 జార్ఖండ్, 2 రాజస్థాన్ 3 ఉత్తరప్రదేశ్ 4 పంజాబ్ 5 మహారాష్ట్ర 6 మధ్యప్రదేశ్ 7 బీహార్ 8 ఆంధ్రప్రదేశ్, 9 ఢిల్లీ , 10 జమ్మూ కశ్మీర్ .
ఎప్రిల్లో 27 రోజుల వ్యవధి లెక్కలను చూసుకుంటే విద్యుత్ సరఫరాకు డిమాండ్కు మధ్య వ్యత్యాసం 1.88 బిలియన్ యూనిట్లు అంటే దాదాపు 1.6 శాతంగా ఉంది. గృహావసరాలకు అవసరం అయిన విద్యుత్ అత్యధిక స్థాయికి చేరుకుంటున్న దశలోనే తమ థర్మల్ విద్యుత్ కేంద్రాలలో అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పాదన ఉండటం లేదు.
పైగా సాధారణ స్థాయి కన్నా కూడా తక్కువగా విద్యుత్ ఉత్పాదన కావడంతో తాము సరైన రీతిలో విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నట్లు విద్యుత్ మంత్రులే తెలిపారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ కోతల షాక్తో సతమతమవుతోంది. అవసరం అయిన బొగ్గు నిల్వలు అడుగంటి పోవడంతో కేవలం రెండు మూడు రోజుల వరకూ నిల్వలు ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతోంది. దీనితో విద్యుత్ సరఫరా సంస్థలు చేతులెత్తేస్తున్నాయి.
ఢిల్లీ మెట్రో రైళ్లకు ఆటంకం!
సర్వత్రా విద్యుత్తోనే చలనం జరిగే క్రమంలో పలు విధాలుగా బ్రేక్లు పడుతున్నాయి. ఢిల్లీలో మెట్రో రైళ్ల నిర్వహణకు అవసరం అయిన విద్యుత్ సరిగ్గా అందడం లేదని, దీనితో వచ్చే రెండు మూడు రోజులలో మెట్రో రైళ్లను నడపడం అసాధ్యమే అవుతుందని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిస్సహాత వ్యక్తం చేసింది.
అయితే బొగ్గు నిల్వలు లేవని గత తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వేసవికి ముందే అతి తక్కువ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉన్నాయని బొగ్గు కేంద్రాల అధికారులు తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో మొత్తం మీద తీవ్రస్థాయి దారుణ విద్యుత్ లోటు ఏర్పడింది. వడగాడ్పులు తీవ్రం అవుతున్న దశలో విద్యుత్ కటకట పలు పర్యవసనాలకు దారితీసింది.
దేశంలో క్రమేపీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, ఇది గురువారం అత్యధికంగా రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర విద్యుత్, ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది. వచ్చే నెల అంటే మేలో ఈ విద్యుత్ డిమాండ్ 8 శాతం వరకూ పెరుగుతుందని అంచనా వేశారు.
మే నెల రెండు మూడు వారాల వరకూ ఎండలు విపరీత స్థాయిలో ఉంటాయి. దీనితో జనం చల్లదనం కోసం అనివార్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవల్సి ఉంటుంది. అయితే విద్యుత్ ఆధారిత ఏర్పాట్లు పనిచేసే పరిస్థితి ఉండదని ఇప్పటి విద్యుత్ వినియోగం ఉత్పత్తి సరఫరాల వ్యత్యాసాలతో తేటతెల్లం అయింది.
ఎప్రిల్ 18 నాటి లెక్కల ప్రకారం మొత్తం మీద బొగ్గు నిల్వలు కేవలం 22.52 మిలియన్ టన్నులే ఉన్నాయి. సాధారణంగా ఈ వేసవి దశలో ఇవి 66 శాతం మించితేనే థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరైన విధంగా పంపిణీకి వీలేర్పడుతుంది. సాధారణ స్టాక్తో పోలిస్తే ఇప్పుడు ఉన్న నిల్వలు కేవలం 34 శాతంగా రికార్డు అయ్యాయి.
ఈ కోటాతో కేవలం 9 రోజులకు అవసరం అయిన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇప్పటి బొగ్గు సంక్షోభం దేశంలో గత ఏడాది అక్టోబర్లో కూడా తలెత్తింది. రాష్ట్రాలలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోవడం, దీనికి సరఫరాకు మధ్య లోటును భర్తీ చేయలేకపోవడం, థర్మల్ కేంద్రాల వద్ద సరైన బొగ్గు నిల్వలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. రష్యా నుంచి సరైన రీతిలో ఇప్పుడు అవసరం అయిన బొగ్గు అందకపోవడం కూడా చిక్కులకు దారితీసింది.