బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు బుల్డోజర్ సెగ తగిలింది. బ్రిటన్ ఎంపీలు స్థానిక చట్టసభల్లో బోరిస్ జాన్సన్ వైఖరిని తప్పుబట్టారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా చేస్తున్న హింసపై భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జారా సుల్తానా విమర్శించారు.
మోదీని ప్రశ్నించేందుకు బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారని తప్పుబట్టారు. మానవ హక్కుల విషయంలో జాన్సన్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు.
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన గుజరాత్ లో జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడున్న బుల్డోజర్ పైకి ఎక్కి అభివాదం చేశారు. అదే సమయంలో భారత్ లోని పలు రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఇండ్లను, దుకాణాలను బుల్డోజర్ లతో ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది.
దీంతో జాన్సన్ ప్రవర్తన తీవ్ర చర్చలకు దారి తీసింది. బోరిస్ జాన్సన్ ఇటీవల భారత్ పర్యటనలో జేసీబీలతో ఫోజులిచ్చారని, ఇళ్ల కూల్చివేతలపై మోదీ వద్ద ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదని బ్రిటన్ ఎంపీ జారా సుల్తానా ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు భారత పర్యటన ఉపయోగపడిందని అంగీకరిస్తారా..? అని ఆమె ప్రశ్నించారు.