దేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.పొద్దుగాల 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు.దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ ఏడాది వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2 వరకూ అదేవిధంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.
సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఏడాది మే నెలలో పశ్చిమ రాజస్థాన్లోని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ దాటేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జమ్ము కాశ్మీర్, పంజాబ్,హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్ నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది 1973, 2010, 2016లలో మాత్రమే. నిజానికి దేశంలో 2010లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని ఐఎండీ అధికారులు చెప్పారు.
ఏప్రిల్లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఈ ఏడాది ఏప్రిల్ 4వ స్థానంలో నిలిచిందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహాపాత్ర చెప్పారు. పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని మహాపాత్ర హెచ్చరించారు.
ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పారు. కాగా గత 122 ఏళ్లలో వాయువ్య, మధ్య భారతంలో ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రతలు 35.90 డిగ్రీ సెల్సియస్, 37.78 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉన్నాయని గుర్తుచేశారు. కాగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 1956లో రాజస్థాన్లో 52.6 డిగ్రీ సెల్సియస్ నమోదయిన విషయం తెలిసిందే.