వైసిపి గ్రామాధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే పార్టీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని సందర్శించడానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే మూడు గంటలపాటు ఆ గ్రామంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేసింది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. స్థానికుల కథనం ప్రకారం… జి.కొత్తపల్లి గ్రామంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వైసిపి గ్రామాధ్యక్షుడు గంజి ప్రసాద్ (58)పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు.
మెడపై, చేతులపై, పొట్ట భాగంలో విచక్షణారహితంగా నరకడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికంగా వ్యవసాయం చేస్తూ కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్న ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో టిడిపిలో ప్రసాద్ ఉండేవాడు. ప్రస్తుత హోం శాఖ మంత్రి తానేటి వనిత వైసిపిలో చేరడంతో ఆయన కూడా పార్టీ మారాడు.
అదే గ్రామ ప్రస్తుత ఎంపిటిసి సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్య మొదటి నుంచి వైసిపిలో కొనసాగుతున్నాడు. వైసిపిలో ప్రసాద్ చేరికతో వీరి ఇరువురి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. కొద్దిరోజుల క్రితమే రెండు గ్రూపుల మధ్య గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటి వద్ద పంచాయితీ జరిగింది.
ఆ రోజు సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి చర్చిద్దామని ఎమ్మెల్యే చెప్పిన కొద్ది రోజులకే ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రసాద్ హత్య విషయం తెలుసుకొని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు జి.కొత్తపల్లి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు.
అప్పటికే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న స్థానికులు, ప్రసాద్ అనుచరులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఆయన కారు దిగగానే ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ప్రసాద్ హత్యకు కారణం నీ అనుచరుడే’ అని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. 250 మందికి పైగా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు.
ఆయన తల, ముఖంపై కొట్టారు. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యేను మహిళలు సైతం కాళ్లతోతన్నారు. చొక్కాను చించేశారు. కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు విసిరారు. ఎమ్మెల్యేకు చెందిన రెండు సెల్ఫోన్లను పగులగొట్టారు. పెద్దసంఖ్యలో పోలీసులు ఉన్నా పరిస్థితిని చక్కదిద్దలేక పోయారు.
‘ప్రసాద్ హత్యకు కారణం నువ్వే’ అంటూ ఆయనపై ఒక్కసారిగా దాడికి దిగి పిడిగుద్దులు గుద్దారు. ఎట్టకేలకు పోలీసులు అతికష్టంపై ఎమ్మెల్యేను పక్కనే ఉన్న ఒక ప్రయివేటు పాఠశాల షెడ్డులోకి తీసుకెళ్లి రక్షణగా నిలిచారు. అయినా, ఎమ్మెల్యేపై గ్రామస్తులు పలువురు మళ్లీ దాడి చేశారు.
దీంతో, ఎమ్మెల్యేకు, అడ్డుకోబోయిన పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే చొక్కా చిరిగిపోయింది. ఈ క్రమంలో అదనపు బలగాలు వచ్చేవరకూ సుమారు మూడు గంటలకుపైగా ఎమ్మెల్యే ఆ స్కూల్లోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోవాల్సి వచ్చింది.
ఎస్పీ రాహుల్దేవ్ అక్కడికి చేరుకుని.. అందరికీ సర్ది చెప్పారు. ఎమ్మెల్యేను కారు ఎక్కించి అక్కడినుంచి పంపించారు. భారీ భద్రత నడుమ ఎమ్మెల్యేను పోలీసులు ఆయన స్వగ్రామం దేవరపల్లి తీసుకెళ్లారు. అనంతరం ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు.
ఇలా ఉండగా, ఎమ్మెల్యే తలారి వెంకటరావు దేవరపల్లి చేరాక మీడియాతో మాట్లాడుతూ జి.కొత్తపల్లిలో తనపై దాడి చేసిన వారంతా టిడిపికి చెందినవారేనని ఆరోపించారు. అక్కడ వందల సంఖ్యలో తనకు తెలియని వ్యక్తులు వచ్చి తనపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. పోలీసులు చాకచక్యంగా తనను కాపాడి సురక్షితంగా ఇంటికి తరలించారని తెలిపారు.
అయితే, హతుని భార్య ఆరోపణ తన భర్త హత్యకు ఎమ్మెల్యే వెంకట్రావే కారణమని హతుడి భార్య భార్య సత్యవతి ఆరోపించింది. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఎంపిటిసి సభ్యుడు బజారయ్య అనుచరులు హత్య చేశారని విలపించింది.‘‘నా భర్త చావుకు ఎమ్మెల్యే వెంకట్రావు, స్థానిక ఎస్ఐలే కారణం. వాళ్లిద్దరూ కలిసే హత్య చేయించారు’’ అని ప్రసాద్ భార్య సత్యవతి ఆరోపించారు.
ఇంతలో, గంజి ప్రసాద్ను తామే హత్య చేసినట్లు ఒప్పుకుని ద్వారకాతిరుమల మండలం పోలీసులకు జి.కొత్తపల్లికి చెందిన సురేష్, మోహన్, హేమంత్ లంగిపోయారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.