వరుసగా రెండోసారి తెలంగాణకు నేషనల్ లీడ్ స్టేట్ అవార్డ్ రావడం గర్వకారణమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ రాజ్ శాఖ ఆడిటింగ్ లో 100 శాతం ఆడిటింగ్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండటం వెనుక అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో తనతో పాటు అధికారులు బాగా పనిచేశారని కొనియాడారు.
దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణను రోల్మోడల్గా చేసుకుని పంచాయితీరాజ్ శాఖలో వందశాతం ఆడిటింగ్ వ్యవహరాలు ఆన్లైన్ ద్వారా జరపాలని సూచిస్తోంది. 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్లు ఉన్న తెలంగాణ రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్ గా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్లే నిధులు కూడా ఇవ్వాలని మంత్రి కోరారు. అవార్డ్ రావడానికి కృషి చేసిన రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్ ల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా అభినందించిన మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.