జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను ఈ నెల 8వ తేదీ నుండి ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు యాత్ర చేపట్టిన ఆయన ఈ సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు.
‘రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే. సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ల కాలంలో బలవన్మరణాలకు పాల్పడ్డార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.
శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్ కల్యాణ్ సాయం అందిస్తారని చెప్పారు. 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లా వస్తారని పేర్కొంటూ రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తామని వివరించారు.