టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల పక్క రాష్ట్రాలపై, కేంద్రంపై ట్విట్లు పెట్టి వివాదాలు రేపిన తెలంగాణ మంత్రి కెటి రామారావు మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు.
ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్..`మోదీకి విజన్ కొరత’ అంటూ ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. “… ఇలా చెప్పుకుంటూపోతే సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు” అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఘాటుగానే ట్విట్టర్ ద్వారానే బదులిచ్చారు.
దేశంలో ఏడేళ్ల బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత,యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చేనిధుల కొరత వచ్చిందన్నారు. ఇవన్ని సమస్యలకు పీఎం, మోదీకి విజన్ లేకపోవడమే కారణమంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.
మంత్రి కేటీఆర్ ట్వీట్లకు ధీటుగానే బదులిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలన వైఫల్యాలను ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. ‘ టీఆర్ఎస్ పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు, రుద్యోగ భృతి లేదు, ఉచిత ఎరువులు లేదు, ఋణమాఫీ లేదు, దళిత ముఖ్యమంత్రి లేదు,దళితులకు మూడెకరాల భూమి లేదు, పంటనష్ట పరిహారం లేదు, దళితబందు లేదు, బిసిబందు అసలే లేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు, డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు, అప్పులకు కొదవ లేదు, కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు, కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు,సామాజిక న్యాయం లేదు,సచివాలయం లేదు, సీఎం ప్రజలను కలిసేది లేదు, ఉద్యమ కారులకు గౌరవం లేదు, విమోచన దినోత్సవం జరిపేది లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే “కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు’ అంటూ విమర్శించారు.
