రష్యా,ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వైపే భారత్ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరన్నదే తమ దృఢమైన అభిప్రాయమని ప్రకటించారు. రష్యా ఐరాస నియమావళికి విరుద్ధంగా ఉక్రెయిన్ పై దాడికి దిగిందని జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షుల్జ్ ఆరోపించినప్పుడు, ప్రధాని ఈ విధంగా స్పందించారు.
వ్యాపార వాణిజ్యంతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే విషయమై విస్తృత స్థాయిలో చర్చల అనంతరం ఈ ఇరువురు నేతలూ సంయుక్తంగా పత్రికా గోష్టిలో మాట్లాడారు.
ఉక్రెయిన్ సంక్షోభం గురించి షుల్జ్ లేవనెత్తగా ప్రధాని స్పందిస్తూ, ‘ఘర్షణలకు తక్షణమే స్వస్తి పలికి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఈ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ చెబుతూనే ఉంది. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. అందరూ నష్టపోయేవారే, కావున మేము శాంతి వైపు ఉంటాము’ అని చెప్పారు.
ఉక్రెయిన్ సంక్షోభం వల్ల తలెత్తిన ఈఘర్షణల వల్ల చమురు ధరలు ఇప్పటికే చుక్కలనంటాయి. ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత ఏర్పడింది. దీనివల్ల ప్రపంచంలో బాధపడని కుటుంబం లేదని ఆయన అన్నారు. వర్థమాన, పేద దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఈ ఘర్షణ వల్ల తలెత్తే మానవీయ సంక్షోభం భారత్కు ఎక్కువ ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
అంతకుముందు ఈ ఇరువురు నేతలు భారత్, జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వ్యాపార వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
వ్యూహాత్మక, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు పరస్పరం తమ అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వైపాక్షిక పరిధిని మించి యావత్ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచం సంక్షుభిత పరిస్థితులనెదుర్కొంటున్న తరుణంలో ఈ రెండు ఖండాలకు చెందిన ప్రధాన శక్తుల మధ్య బంధం బోలపేతానికి చాలా ప్రాధాన్యముందని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ఉపశమించిన తరువాత తొలిసారి మూడు ఐరోపా దేశాల్లో పర్యటనకు బయల్దేరిన భారత ప్రధానికి బెర్లిన్లో జర్మన్ చాన్సలర్ సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70ఏళ్లయిందని, వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దశాబ్దాలుగా కొనసాగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.