గత ఏడాది కాలంగా మీడియాపై దాడులు పెరుగుతుండడం పట్ల నేషనల్ అలయన్స్ ఫర్ జర్నలిస్ట్స్ (ఎన్ఎజె), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డియుజె) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఏకపక్ష అరెస్టులు, వేధింపుల నుంచి మీడియా సిబ్బందిని రక్షించేందుకు తక్షణమే సమగ్ర చట్టాన్ని రూపొందించాలని అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకు నిర్భయంగా పోరాడేందుకు వీలుంటుందని పేర్కొన్నాయి. ఎలాంటి అధికారాలు లేని ప్రెస్ కౌన్సిల్ స్థానంలో అన్ని పక్షాలకు చెందిన నిపుణులతో మీడియా కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సాహసోపేతంగా పోరాడుతున్న జర్నలిస్టుల వాణిని వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్లు తీర్మానించాయి.
ఫాసిజం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం, దాడులు జరపడం, ఇంటర్నెట్పై నిషేధాలు, గూఢచర్యం, ట్రోలింగ్ వంటి అనేక చర్యల ద్వారా కొనసాగుతున్న పాలనాపరమైన, పోలీసుల వేధింపులను, పలు సవాళ్లను జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు.
ట్రోలింగ్, సోషల్ మీడియాలో దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. మహిళా జర్నలిస్టులు తరచుగా దాడులకు లక్ష్యాలుగా మారుతున్నారు. ఇన్ని సవాళ్లు, సమస్యలతో జర్నలిస్టులు బాధపడుతున్నా ఏడాది కాలంగా ప్రెస్ కౌన్సిల్ ఛైర్పర్సన్ పదవి ఖాళీగా వుండడం విచారకరమని ఎన్ఎజె, డియుజె తెలిపాయి.