సరిహద్దుల్లో ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం చైనా కొనసాగిస్తూనే ఉంది. ఒక వంక సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడం కోసం అంటూ సైనిక స్థాయిలో భారత్ తో చర్చలు జరుపుతూనే, మరోవంక దొంగచాటుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, సేనల మోహరింపు చేస్తూనే ఉంది.
తాజాగా, పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. ఈ బ్రిడ్జ్ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గత ఏడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది.
1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎప్పటికీ అంగీకరించలేదు’ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో తెలిపారు.
పాంగాంగ్ సరస్సు సమీపంలోని కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం కోసం చైనా ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆగస్టు 2020 నాటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత సాయుధ బలగాలు ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ వంతెన నిర్మాణమని చేపట్టింది. దీంతో స్పంగూర్ సరస్సు వద్దనున్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది.