ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కీలక వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్బిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నామని, దీంతో రెపోరేటు 4.40 శాతానికి చేరుతుందని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్ వెల్లడించారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సర్దుబాటు ధోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు శక్తికాంతదాస్ ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుతుండడంతో అత్యవసరంగా భేటీ కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాగా వడ్డీరేట్ల పెంపు పై ఏప్రిల్లో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనలోనే సంకేతాలిచ్చారు. అయితే జూన్లో జరిగే తదుపరి ఎంపిసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఫిబ్రవరిలో 6.07 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. మార్చిలో 6.95 శాతానికి చేరింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలు భగ్గుమంటున్నాయి. కోళ్ల పెంపకానికి వాడే దాణా, పొద్దు తిరుగుడు నూనె వంటి వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాల మధ్య అంతరం జనవరిలో 4.7 శాతం అయితే, ఇప్పుడు 2.3 శాతానికి తగ్గింది.
ఆర్బిఐ నిర్ణయంతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 2:37 గంటల సమయంలో సెన్సెక్స్ 1120 పాయింట్లు పడి 55,849 వద్ద నిలవగా, నిఫ్టీ 345 పాయింట్లు దిగజారి 16,721 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు కాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు వెల్లడించింది. తాజా పెంపుతో సిఆర్ఆర్ 4.50 శాతానికి పెరిగిందని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఈ ప్రభావంతో రూ.83,711.55 కోట్ల నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరణ జరుగుతుందని వివరించారు. సీఆర్ఆర్ పెంపు మే 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు.
కాగా రెపో రేటును చివరిసారిగా మే 2020లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు యథాతథంగా కొనసాగుతున్నది. రెపో రేటు పెంపుతో రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం పెరగనుంది. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయి. ఈ ప్రభావం గృహరుణాలతోపాటు వాహన లేదా వ్యక్తిగత రుణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మరోవంక, గత కొంత కాలంగా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించాయి. దీంతో చాలా మంది నగదు దాచుకునేందుకు బ్యాంకులకు ప్రత్యామ్నాయం చూస్తున్నారు. చిట్టీలు, రియల్టీ, స్టాక్మార్కెట్ వైపు మళ్లుతున్నారు. తాజాగా వడ్డీ రేట్ల పెంపుతో ఫిక్స్డ్, టర్మ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించనుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల కమర్షియల్ బ్యాంకుల్లోకి నిధులు ప్రవహించే అవకాశం ఉంది.
వాణిజ్య బ్యాంకుల వద్ద ప్రతి సారీ సరిపడా నిధులు ఉండవు. అలాంటి సమయాల్లో ఆర్బీఐ వద్ద రుణంగా నిధులను తీసుకుంటాయి. అయితే ఆర్బీఐ కొంత వడ్డీరేటుతో బ్యాంకులకు రుణాలిస్తుంది. ఆర్బీఐకి వాణిజ్య బ్యాంకులు చెల్లించే ఈ వడ్డీ రేటునే రెపో రేటు అంటారు.
అయితే ఈ వడ్డీ రేటు పెంపు లేదా తగ్గింపు లేదా యథావిథిగా కొనసాగించడం ఆర్బీఐ నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. ఆర్థిక వ్యవస్థపై నగదు ప్రభావం, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఆధారంగా ఆర్బీఐ మోనిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో రెపో రేటు ఆర్బీఐకి చాలా చాలా ముఖ్యమైనది. ఆర్బీఐ తీసుకునే నిర్ణయం వాణిజ్య బ్యాంకుల రుణ రేట్లు ఆధారపడి ఉంటాయి.