హైదరాబాద్ నగరంలో ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. సరూర్నగర్ మండల్లోని మర్పల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆ దంపతులపై జరిగిన దాడిలో భర్త చనిపోయాడు.
వివరాలలోకి వెళితే…బి. నాగరాజు(25), అష్రిన్ సుల్తానా(23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వీరిపై భార్య తరఫు కుంటుంబీకులు ఇద్దరు ఇనుప రాడ్లతో దాడిచేశారు. దాడిచేసిన వారు కత్తి తీసుకుని నాగరాజును కసకసా పొడిచేస్తుంటే ఆ దారిన వెళుతున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగరాజు దాడి జరిగిన చోటే అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అంతా సిసిటివిలో రికార్డు అయింది.
కాగా గాయాలపాలైన అష్రిన్ సుల్తానాను దారిన వెళుతున్న వారు దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ దంపతులు మర్పల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా వారు ప్రేమించుకున్నారని, అయితే వారి సంబంధాన్ని అమ్మాయి తరఫు కుటుంబీకులు వ్యతిరేకిస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు. పైగా ఆ అమ్మాయిని అతడితో కలువకుండా కట్టడి చేశారని కూడా తెలిపారు.
`పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని ఆశ్రిన్ సుల్తానా మీడియా ముందు పేర్కొన్నారు.
పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఇది పూర్తిగా మతపరంగా కిరాతకంగా జరిగిన హత్య అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక మేధావులు, పార్టీలు, అభ్యుదయ మీడియా పెదవి విప్పడం లేదే అంటూ ఎద్దేవా చేశారు.
సరూర్ నగర్ పరువు హత్య కేసులో పట్టుబడ్డ ఇద్దరు నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని హోమంత్రి మహమూద్ అలీ, డిజి పి మహేందర్రెడ్డికి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కోరారు. హత్య జరిగిన 24 గంటల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ అదే రీ తిలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు.
కాగా, మతోన్మాద రజాకార్ అజెండాలో భాగంగా, కుట్రపూరితంగా నాగరాజును హత్య కావించారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషద్ కార్యకర్తలు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. హంతకులను అరెస్ట్ చేశామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరలో వారికి శిక్షలు పడేవిధంగా చూస్తామని పోలీస్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.