భారత్లోనే అత్యధిక కరోనా మృతులు నమోదయ్యాయన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నివేదికపై కేంద్రం మండిపడింది. ఈ నివేదికలో వాస్తవం లేదని, అర్థరహితమని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు.
డబ్ల్యుహెచ్ఒ తీరు దుర్మార్గంగా ఉందని, అంచనాలు ఆమోద యోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. డబ్ల్యుహెచ్ఒ అనుసరిస్తున్న లెక్కింపు విధానాన్ని తోసిపుచ్చారు. డబ్ల్యుహెచ్ఒ అనుసరిస్తున్న గణిత విధానాలపై తాము ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు.
అయినా పట్టించుకోకుండా ఈ అంచనాలను విడుదల చేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్ల్యుహెచ్ఒ నివేదిక ఆమోదయోగ్యం కాదని, దురదృష్టకరమని చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి 5.24 లక్షల మందకరోనాతో మరణించారని, భారత్ పేర్కొనగా.. డబ్ల్యుహెచ్ఒ అంచనాలు దీనికి 9 రెట్లకు పైగా ఉండటం గమనార్హం.
కరోనా ప్రభావంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లలో సుమారు 1.50 కోట్ల మంది మరణించినట్లు డబ్ల్యుహెచ్ఒ అంచనా వేసింది. భారత్లోనే 47.40 లక్షల మంది మరణించారని గురువారం తాజా నివేదికలో పేర్కొంది.
2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు కరోనా ప్రభావంతో నమోదైన మృతులపై డబ్ల్యుహెచ్ఒ ఈ అంచనాలను రూపొందించింది. ఈ రెండేళ్లలో కరోనా సోకి గాని, కరోనాతో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడం తో మతి చెందిన వారి సంఖ్య 1.33 కోట్ల నుంచి 1.66 కోట్ల మధ్య ఉండవచ్చని తెలిపింది.
అయితే, డబ్ల్యుహెచ్ఒ నివేదికపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ సైన్స్ అసత్యాలు చెప్పదని, మోదీ చెప్పగలరని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి కారణంగా 47 లక్షల మంది భారతీయులు మరణించారని, మోదీ ప్రభుత్వం పేర్కొన్నట్లు 4.8 లక్షలు కాదని ఆయన స్పష్టం చేశారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను గౌరవించాలని, ఆ కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా కారణంగా సంభవించిన మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తున్నదంతా అవాస్తవమని బీజేపీ పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ బేటా (కుమారుడు), డబ్ల్యూహెచ్ఓ డేటా తప్పుడువని విమర్శించారు.