మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళాహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబునాయుడుతో పాటుగా బొజ్జల గాయపడ్డారు. 1989, 1994, 1999, 2009, 2014లో 5 దఫాలుగా గెలుపొందిన బొజ్జల ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా ఏ.పీ తొలి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు.
1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని పేర్కొన్నారు.
1949 ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా ఉరండూరులో జన్మించిన ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో డిగ్రీ,లా చేశారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని పేర్కొంటూ బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
బొజ్జల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో తనతో కలసి పనిచేసిన బొజ్జల ఆత్మీయుడని, అలాంటి మిత్రున్ని కోల్పోయానని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. బొజ్జల కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇటీవల బొజ్జల పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. టీడీపీ పేరు మీద రూపొందించిన కేక్ను బొజ్జలకు చంద్రబాబు స్వయంగా తినిపించారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.
తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు.