ఒక వ్యక్తిని భారతీయుడిగా విదేశీ ట్రిబ్యునల్ (ఎఫ్టి) పరిగణించిన ఆ వ్యక్తి ఎప్పటికీ భారతీయుడేనని గుహవటి హైకోర్టు విదేశీ ట్రిబ్యునల్ బెంచ్ పేర్కొంది.
భారతీయ పౌరునిగా గుర్తించిన అనంతరం అదే వ్యక్తిని రెండోసారి ట్రిబ్యునల్ ఎదుట హాజరుపరిస్తే విదేశీయునిగా ప్రకటించలేమని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ నాని త్యాగిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గతంలో భారతీయులుగా ప్రకటించబడినప్పటికీ.. మరోసారి విచారణలో విదేశీయులుగా ప్రకటించారంటూ కొందరు పిటిషనర్లు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఒక వ్యక్తి పౌరసత్వంపై ఎఫ్టి ఇచ్చిన అభిప్రాయం రెస్ జ్యుడికాటా లా ప్రకారం పనిచేస్తుందని పేర్కొంది.
అంటే సంబంధిత న్యాయస్థానం ఇచ్చినదే తుది తీర్పు.. ఇదే అంశంపై ప్రతివాదులు మరోసారి కోర్టుకు వచ్చినా ఆ కేసు విచారించబడదని తెలిపింది. అలాగే రెస్ జ్యుడికాటా వర్తించే గతంలోని రెండు కేసుల్లో తీర్పులను ప్రస్తావించింది.
మొదటిది .. అమీనా ఖాతూస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసు, రెండవది.. అబ్దుల్ కుద్దూస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2019) కేసుల్లో ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది.