తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుల చరిత్ర కాంగ్రెస్దని , టిఆర్ఎస్తో బిజెపి ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు, భవిష్యత్లో పెట్టుకోదనిబిజెపి ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామనంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని వరంగల్ లో రాహుల్ గాంధీ హామీలపై ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని చెబుతూ కాంగ్రెస్ ఢిల్లీలో కాదుగదా.. గల్లీలో కూడా లేదని… రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు.
కాంగ్రెస్కు ఓటేసినా టీఆర్ఎస్కే చెల్లుతుందని పేర్కొన్నారు. గెలిసిన వాళ్ళందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరటం ఖాయమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో బీజేపీ ఏనాడు పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోదని స్పష్టం చేశారు.
తెలంగాణాలో రాహుల్ సభలు వృధా ప్రయాసని చెబుతూ గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థ పార్టీ కాంగ్రెసేనని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక గూటి పక్షులే అని పేర్కొంటూ ఎన్నికల ముందో ఎన్నికల తర్వాతో కలుస్తారని తెలిపారు.
బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లీస్లు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. రాజ్యాంగ సంస్థల్లో కేంద్రం జోక్యం ఉండదని తేల్చిచెప్పారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్ట రీత్యా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయని లక్ష్మణ్ వెల్లడించారు.