వచ్చే ఎన్నికలలో క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ తీసుకొని టికెట్లు ఇస్తామని చెబుతూ హైదరాబాద్లో కూర్చుంటే టికెట్లు రావని, ప్రజలతో ఉండి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు గాంధీభవన్లో రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని హామీ ఇచ్చారు.
‘‘ప్రజల్లో ఉండి వారిపక్షాన పనిచేసే నాయకులకే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది. పార్టీ నేతలెవరూ హైదరాబాద్లో ఉండొద్దు. అలాగని టికెట్ల కోసం ఢిల్లీకి రావొద్దు. స్వతంత్రంగా క్షేత్రస్థాయి నుంచి తీసుకున్న అభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తాం’’అని చెప్పారు.
“పార్టీ టికెట్లు మెరిట్ ప్రతిపాదకనే ఇస్తాం. ఎవరూ భ్రాంతిలో ఉండకండి. తర్వాత నన్ను తప్పుపట్టొద్దు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో.. రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, యువత పక్షాన పోరాటం చేస్తారో వారికే పార్టీ టికెట్ ఇస్తుంది. ఇది మన కుటుంబం. ఎవరి పట్లా వివక్ష ఉండదు. పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఎంత సీనియర్ అయినా, ఎంత చరిత్ర ఉన్న నాయకుడైనా సరే పనిచేయకపోతే మాత్రం టికెట్లు రావని స్పష్టం చేశారు. స్వతంత్ర సమాచారం, క్షేత్రస్థాయి సమాచారం తీసుకుని టికెట్లు కేటాయిస్తామని చెబుతూ హైదరాబాద్లో ఉంటే టికెట్లు రావని హెచ్చరించారు. ఢిల్లీ మాత్రం అసలు రావద్దని చెబుతూ ఢిల్లీ వస్తే బ్యాక్ఫైర్ అవుతుందని హితవు చెప్పారు.
“హైదరాబాద్లో బిర్యానీ బాగుంటుందని, మంచి చాయ్ ఉంటుందని తెలుసు. కానీ వాటిని వదిలిపెట్టి మీ నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లండి. మీరు ప్రజల మధ్యలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది” అని సూచించారు.
వరంగల్ డిక్లరేషన్ రైతులకు కాంగ్రెస్కు మధ్య నమ్మకం కలిగించేదని కొనియాడారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అది అందరికీ అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. వచ్చే నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని కోరారు. మీడియా మందు ఏది పడితే అది మట్లాడొద్దని హితవు చెప్పారు. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడండి అంటూ మీడియాకు ఎక్కితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జన బలం లేదని విమర్శించారు. ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరాటం ఉండబోతుందని తెలిపారు.